తెలంగాణలో భానుడి భగభగలు మొదలవ్వకముందే మద్యం ప్రియులు చల్లని బీర్ల వైపు పరుగులు తీస్తున్నారు. సాధారణంగా తెలంగాణలో మార్చి చివరి వారం నుండి ఎండల తీవ్రత పెరిగి, అప్పుడు బీర్ల అమ్మకాలు ఊపందుకుంటాయి. కానీ ఈ ఏడాది సీన్ రివర్స్ అయింది. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో, మద్యం దుకాణాల్లో బీర్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం 40 శాతం అదనంగా విక్రయాలు జరుగుతుండటం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వేసవి తాకిడి ముందుగానే ఉండవచ్చన్న అంచనాలతో వినియోగదారులు కూడా చల్లదనం కోసం బీర్లను ఆశ్రయిస్తున్నారు.
US Attack : ట్రంప్ వీకెండ్ దాడుల వెనుక – మార్కెట్ వ్యూహం ?
రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాల్లో బీర్ల విక్రయాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ఈ జిల్లాల్లో ఎండల తీవ్రత ఇతర ప్రాంతాల కంటే కొంత ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఇక గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే, నెలాఖరు నాటికి ఐటి కారిడార్ మరియు ఇతర ప్రధాన ప్రాంతాల్లో అమ్మకాలు మరింత పుంజుకుంటాయని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే స్టాక్ కొరత రాకుండా డిపోల నుంచి సరఫరాను క్రమబద్ధీకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
ఈ వేసవి సీజన్ మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించనుంది. కేవలం ఈ మూడు నెలల వేసవి కాలంలోనే సుమారు 7,000 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉందని అంచనా. ఎండలు ముదిరితే ఈ అంకె ఇంకా పెరిగే అవకాశం ఉంది. అటు వ్యాపారులు కూడా డిమాండ్కు అనుగుణంగా ఫ్రిజ్లు, కూలర్లను సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తానికి ఈసారి ‘సమ్మర్ కిక్’ ముందే మొదలైందని చెప్పవచ్చు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :