ఆంధ్రప్రదేశ్(AP)లో కీలకంగా భావిస్తున్న పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు (Polavaram–Banakacherla Project ) పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుకు అవసరమైన అటవీ, పర్యావరణ అనుమతులు త్వరగా పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూసేకరణ ప్రక్రియ కూడా ముందుగానే సిద్ధంగా ఉండాలన్నారు. ఈ నెలాఖరులోపు టెండర్లను పిలవాలనే దిశగా పూర్తి ప్రణాళికను రూపొందించాలన్నారు.
రూ.81,900 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్ నిర్మాణం
ఈ ప్రాజెక్ట్ మొత్తం రూ.81,900 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ భారీ ప్రాజెక్ట్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం, విదేశీ ఆర్థిక సంస్థల నుండి రుణాల ద్వారా నిధులు సమకూరనున్నాయి. ఇందులో 50% నిధులు విదేశీ ఆర్థిక సంస్థల (EAP) ద్వారా రుణంగా, 20% కేంద్రం గ్రాంట్ రూపంలో, 10% రాష్ట్ర ప్రభుత్వం ఈక్విటీ రూపంలో, మరో 20% హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) విధానంలో ఉంటాయని తెలిపారు.
దక్షిణాంధ్ర ప్రాంతాలకు ఇది జీవనాడి
ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలోని సాగునీటి అవసరాలపై పెద్ద ఎత్తున భారం తీరుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణాంధ్ర ప్రాంతాలకు ఇది జీవనాడిగా మారే అవకాశముందని అన్నారు. తాగునీరు, సాగునీరు అవసరాలను తీరుస్తూ రాష్ట్రం వ్యవసాయ ప్రగతికి మార్గం సుగమం చేయగల ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టంగా చెప్పారు.
Read Also : Surya: ‘వాడివాసల్’ నుంచి తప్పుకున్న సూర్య ఎందుకంటే?