తెలంగాణలో మద్యం షాపుల లైసెన్సుల (Liquor Shops) కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన కీలక నిర్ణయాలను ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. కొత్తగా షాపులు నిర్వహించాలనుకునే వ్యాపారులు టెండర్లలో పాల్గొనాలంటే ముందుగా రూ.3 లక్షల ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో ఎక్సైజ్ శాఖకు చెల్లించాలి. ఈ మొత్తం తిరిగి చెల్లించబడదని స్పష్టంచేశారు. వచ్చే అక్టోబర్ 23న డ్రా నిర్వహించి అర్హులైన దరఖాస్తుదారులను ఎంపిక చేయనున్నారు. దీంతో వ్యాపారులు భారీగా పోటీ పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈసారి లైసెన్స్ ఫీజులను జనాభా ఆధారంగా ఆరు శ్లాబులుగా విభజించారు. 5వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో మద్యం షాపుల లైసెన్స్ ఫీజు రూ.50 లక్షలుగా నిర్ణయించారు. 5వేల నుంచి 50వేల మధ్య జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 50వేల నుంచి లక్ష జనాభా వరకు రూ.60 లక్షలు వసూలు చేయనున్నారు. ఇక ఒక లక్ష నుంచి 5 లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉన్న జనాభా గల నగరాల్లో రూ.85 లక్షలు, 20 లక్షలకు పైబడిన మెట్రో నగరాల్లో రూ.1.10 కోట్ల లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ నిర్ణయాల వల్ల పట్టణాలు, గ్రామాల వారీగా లైసెన్స్ ఖర్చులు పెరిగి పోటీ మరింత తీవ్రమవుతుందని భావిస్తున్నారు. చిన్న పట్టణాల్లో షాపు ప్రారంభించదలచిన వ్యాపారులు తక్కువ ఖర్చుతో అవకాశం పొందగలిగినా, పెద్ద నగరాల్లో మాత్రం భారీ మొత్తాన్ని భరించాల్సి ఉంటుంది. మరోవైపు, ఎక్సైజ్ శాఖ ఈ చర్యల ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తోంది. ఈ విధంగా లైసెన్స్ విధానం పారదర్శకంగా, సిస్టమాటిక్గా ఉండేలా ప్రభుత్వం ముందడుగు వేసిందని అధికారులు చెబుతున్నారు.