మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ (Satyavathi Rathod) తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆమె.. “నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం విత్తనాలు వేయడానికి ముందు రైతుబంధు అందించేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ఓట్లను దృష్టిలో ఉంచుకుని రైతు భరోసా నిధులు విడుదల చేస్తోంది” అంటూ వ్యాఖ్యానించారు. 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె తెలిపారు.
రైతుల సమస్యలపై బీఆర్ఎస్ మరోసారి పోరాటానికి సిద్ధం
కేసీఆర్ ప్రభుత్వం(KCR Govt)లో రైతులకు ఏడాదికి రెండు పంటలకూ రైతుబంధు అందించారని గుర్తు చేశారు. “ఇప్పటి వరకూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమందికి రైతుబంధు జమచేసిందో వెల్లడించాలి” అంటూ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని, డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏ అభివృద్ధి పనీ చేయలేదని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేదంటే బీఆర్ఎస్ పార్టీ రైతులతో కలిసి ఉద్యమం ప్రారంభిస్తుందని హెచ్చరించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంపై అవినీతి ఆరోపణలు
సత్యవతిరాథోడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో ఆరోపణ చేస్తూ, ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అవినీతికి వేదికగా మార్చినట్లు చెప్పారు. కురవి మండలంలోని కొత్తూరు గ్రామాన్ని మోడల్ గ్రామంగా ఎంపిక చేసినా, అర్హులందరికీ ఇళ్లు మంజూరు కాలేదని పేర్కొన్నారు. “గొప్పలు చెప్పే ముందు, నిజంగా ఎన్ని ఇళ్లు ఇచ్చారో వివరాలు వెల్లడించాలి” అని ఆమె డిమాండ్ చేశారు. చివరిగా, కేసీఆర్కు ఆయురారోగ్యాలు కలగాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, నూతక్కి నర్సింహారావు, గుగులోతు రవి నాయక్, గుగులోత్ పద్మ, బోడ శ్రీను, అల్లూరి కిషోర్ వర్మ, బాదె నాగయ్య, యానాల గంగాధర్ రెడ్డి, కిన్నెర మల్లయ్య, బిక్షం రెడ్డి, చిన్నం భాస్కర్, దిడ్డి శ్రీను, బోజ్యా నాయక్, రాజు నాయక్, గుండెబోయిన సూరయ్య, కళ్లెపు శ్రీను, అర్జున్ చౌహాన్, రవి, తదితరులు పాల్గొన్నారు.
Read Also : Vande Bharat Express :రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్