నవరాత్రులు (Navratri) హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. తొమ్మిది రాత్రుల పాటు దుర్గ, లక్ష్మి, సరస్వతి దేవతల ఆరాధనతో సకల సౌభాగ్యాలు లభిస్తాయని నమ్మకం. అయితే, ఈ పూజ మరింత సంపూర్ణంగా ఉండాలంటే నవరాత్రులు ప్రారంభమయ్యే ముందు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. వీటి ద్వారా మన గృహం, మనస్సు, శరీరం పవిత్రమవుతాయి. పండుగకు ముందు గృహ శుద్ధి చేయడం ముఖ్యమైంది. ఇంట్లో ఉన్న పాత, పనికిరాని వస్తువులను తొలగించి, ఇంటి లోపలి భాగాన్నీ, బయటా భాగాన్నీ శుభ్రం చేయాలి. ముఖ్యంగా పూజామందిరాన్ని ప్రత్యేకంగా శుభ్రపరచి, రంగోలి లేదా ముగ్గులు వేసి, పుష్పాలతో అలంకరించడం శుభప్రదమని భావిస్తారు.
వ్యక్తిగత శుద్ధి కూడా అంతే ముఖ్యం. నవరాత్రులు మొదలయ్యే రోజున తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించడం ఆచారంగా ఉంటుంది. కొంతమంది ఈ తొమ్మిది రోజులూ ఉపవాసం ఉండే సంప్రదాయాన్ని పాటిస్తారు. ఉపవాసం చేయాలని నిర్ణయించుకున్న వారు ముందే తమ శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి. అలాగే ఈ రోజుల్లో సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి, మద్యం వంటి వాటిని పూర్తిగా మానేయాలి. సాత్విక ఆహారం శరీరాన్ని శుభ్రపరచడమే కాకుండా మనస్సుకు ప్రశాంతతను కూడా అందిస్తుంది.

అంతేకాకుండా, నవరాత్రుల ముందు మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం అత్యంత కీలకం. అనవసరమైన గొడవలు, చెడు ఆలోచనల నుండి దూరంగా ఉండాలి. పూజ, ధ్యానం, కీర్తనల ద్వారా మన మనస్సును దైవానికి అంకితం చేస్తే పూజకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ నియమాలు కేవలం ఆచారాలు మాత్రమే కాకుండా, మన జీవితాన్ని పవిత్రం చేసుకోవడానికి, దైవిక శక్తిని ఆహ్వానించడానికి ఉపయోగపడతాయి. ఇలావుంటే నవరాత్రులు కేవలం పండుగగా కాకుండా, ఆధ్యాత్మిక శక్తిని అనుభవించే దశలుగా మారి, అమ్మవారి ఆశీస్సులతో జీవితం సంతోషకరంగా, శాంతియుతంగా ఉంటుంది.