Online gaming addiction : . ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన 22 ఏళ్ల మహ్మద్ కైఫ్ పబ్జీ గేమ్ ఆడుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. అధిక రక్తపోటు కారణంగా మెదడులో రక్తనాళాలు చిట్లి తీవ్రమైన రక్తస్రావం జరగడమే ఈ దుర్ఘటనకు కారణమని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఖైర్నగర్ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహ్మద్ ఫరూఖ్ కుమారుడైన కైఫ్, తండ్రి వ్యాపారంలో సహాయం చేస్తూ ఉండేవాడు. శుక్రవారం కార్యాలయంలో ఇయర్ఫోన్లు పెట్టుకుని పబ్జీ గేమ్లో మునిగిపోయిన అతడు, గేమ్ సమయంలో తీవ్రమైన ఒత్తిడికి లోనై ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. వెంటనే సహచరులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతని రక్తపోటు 300కు పైగా ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు.
Read Also: AP: రేపు మంత్రులు, సెక్రటరీలతో సీఎం చంద్రబాబు సమావేశం
పరిస్థితి విషమించడంతో కైఫ్ను ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల పాటు చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడిన కైఫ్, ఆదివారం తుదిశ్వాస విడిచాడు. అధిక రక్తపోటు వల్ల మెదడులో అంతర్గత రక్తస్రావం జరగడమే మరణానికి కారణమని వైద్యులు వెల్లడించారు.
ఈ ఘటనతో కలచివేసిన కైఫ్ తండ్రి, “అతడు ఎప్పుడూ మొబైల్తోనే గడిపేవాడు. గేమ్లు, రీల్స్కు అలవాటు పడ్డాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా వినలేదు” అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఆన్లైన్ గేమ్ల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని, పిల్లల మొబైల్ వినియోగంపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: