రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు
హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్(ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్) రెండు ఎమ్మెల్సీ స్థానాలకు, నల్లగొండ, వరంగల్, ఖమ్మం(ఉపాధ్యాయ) ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 27న పోలింగ్ జరుగనున్నది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనున్నది. ఇప్పటికే ఆయా జిల్లాల పరిధిలో అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. కాగా, మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసింది. కరీంనగర్ రెండు ఎమ్మెల్సీ స్థానాల నుంచి మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీలు ఉన్నారు. ఇందులో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది, నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ప్రచారానికి తెర..
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. మొత్తంగా మూడు ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఉత్కంఠరేపుతున్నది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.. ఎవరి బలమెంత అన్న చర్చోపచర్చలు టీచర్లు, గ్రాడ్యుయేట్లలో జోరుగా సాగుతున్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఎవరూ గెలిచే అవకాశాల్లేవన్న ప్రచారమున్నది. ఈ నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓటు ఒకరికి వేస్తే.. ఎవరికి రెండు, మూడు, నాలుగో ప్రాధ్యాత ఓట్లు వేయాలన్న చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఎవరు మొదటిస్థానంలో ఉంటారు.. ఎవరు ముందుగా ఎలిమినేట్ అవుతారు.. ఎలిమినేట్ అయిన వారి రెండో, మూడో ప్రాధాన్యత ఓట్లను ఎవరికి బదలాయించాల్సి వస్తుందన్న అంచనాలు, చర్చలు హాట్హాట్గా జరుగుతున్నాయి. పోలింగ్కు ఒక్కరోజు మాత్రమే సమయం ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు కొందరు అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.