వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరోసారి వార్తల్లోకెక్కారు. గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన ఆయన, ఇప్పుడు బొలీవియాలో భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘కైలాస’ సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు నిత్యానంద అనుచరులు అక్కడ భూములను లీజుకు తీసుకునేందుకు పక్కా ప్రణాళిక వేసినట్లు సమాచారం.నిత్యానంద అనుచరులు స్థానిక తెగలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నించారు. వందల ఎకరాల భూమిని లీజుకు తీసుకోవాలని భావించగా, బొలీవియా ప్రభుత్వం అప్రమత్తమై ఈ వ్యవహారాన్ని అడ్డుకుంది.

కైలాసకు చెందిన 20 మందిని అధికారులు అరెస్టు చేసి స్వదేశాలకు పంపించారు.నిత్యానంద అనుచరులు ముందుగా కార్చిచ్చు సమయంలో సహాయ కార్యక్రమాలు నిర్వహించి స్థానిక ప్రజలకు మేలు చేసినట్లు నటించారు.ఆ తర్వాత అక్కడి భూములపై కన్నేశారు. ఒక తెగ నేతకు 2 లక్షల డాలర్లు చెల్లిస్తే, ఢిల్లీ పరిమాణానికి సమానమైన భూమిని 25 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. అయితే, నిత్యానంద అనుచరులు ఆ లీజును వెయ్యి సంవత్సరాలపాటు పొడిగించాలని కోరడంతో అసలు విషయం బయటపడింది.కైలాస ప్రతినిధులు బొలీవియా అధ్యక్షుడు లూయిస్ ఆర్స్తో ఫోటోలు దిగడం కూడా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై బొలీవియా మీడియా కథనం ప్రచురించడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది.నిత్యానంద దేశం విడిచి పారిపోయిన తర్వాత ‘కైలాస’ అనే ప్రాంతాన్ని ఏర్పాటు చేశానని ప్రకటించారు. కానీ, అది ఎక్కడ ఉందనే దానిపై స్పష్టత లేదు. ఈక్వెడార్ సమీపంలో ఓ చిన్న దీవిని కొనుగోలు చేసి, దానికి ‘కైలాసం’ అని పేరు పెట్టినట్లు గతంలో నిత్యానంద వెల్లడించారు.నిత్యానంద మరోసారి వివాదాస్పదంగా మారారు. బొలీవియాలో భూముల కుంభకోణానికి పాల్పడిన అనుచరులపై చర్యలు తీసుకోవడంతో, ఆయన ప్లాన్ ఫెయిల్ అయినట్టే! మరి, ఈ కేసు ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.