దసరా సెలవులు ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా రహదారులపై వాహనాల రద్దీ గణనీయంగా పెరిగింది. పాఠశాలలు, కాలేజీలు, ఆఫీసులు సెలవులు ప్రకటించడంతో ప్రజలు తమ సొంత ఊర్లకు, పర్యాటక ప్రదేశాలకు బయలుదేరుతున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద వాహనాల క్యూలు కిలోమీటర్ల మేర ఏర్పడుతున్నాయి. దీని కారణంగా ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఆలస్యమవుతూ, సమయ నష్టం అధికమవుతోంది.
టోల్ ప్లాజా వద్ద మినిమం వెయిటింగ్ టైం రూల్
చాలామందికి తెలియని ఒక ముఖ్యమైన నిబంధన టోల్ ప్లాజాల వద్ద అమలులో ఉంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సర్క్యులర్ ప్రకారం, ఒక్కో వాహనం టోల్ బూత్ వద్ద 10 సెకండ్లకు మించి ఆగాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా, టోల్ ప్లాజా వద్ద క్యూలైన్ 100 మీటర్లకు మించి ఉంటే, ఆ సమయంలో ఉన్న వాహనాలకు టోల్ ఫీజు లేకుండానే వెళ్లిపోవడానికి అనుమతి ఉంది. అంటే, టోల్ సిబ్బంది ముందున్న వాహనాలను టోల్ చెల్లించకుండానే వదిలివేయాలి. ఈ రూల్ ద్వారా ప్రయాణికుల సమయం ఆదా కావడమే కాకుండా రోడ్లపై ట్రాఫిక్ తగ్గుతుంది.
ప్రజల్లో అవగాహన అవసరం
ఈ నిబంధన ఉన్నప్పటికీ, ఎక్కువ మంది వాహనదారులకు ఇది తెలియకపోవడం వల్ల గంటల తరబడి టోల్ ప్లాజాల వద్ద క్యూలలో వేచి ఉంటున్నారు. దీంతో ప్రయాణ సమయం పెరగడం, ఇంధన వ్యయం అధికం కావడం, ప్రయాణికులు అసౌకర్యం ఎదుర్కోవడం జరుగుతోంది. అధికారులు ఇకపై వాహనదారులు ఈ రూల్ గురించి తెలుసుకొని, టోల్ వద్ద అక్కర్లేకుండా సమయం వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో పండుగల కారణంగా రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున, ఈ రూల్ను వాహనదారులు పాటిస్తే వారికి సౌలభ్యం కలగడమే కాకుండా రోడ్లపై రద్దీ కూడా తగ్గుతుంది.