యాసంగి ధాన్యం కొనుగోళ్లు మరియు తాగునీటి సరఫరాపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని స్పష్టం చేశారు. ప్రతి జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి కొనుగోళ్లను సమర్ధవంతంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.
యాసంగిలో రికార్డు స్థాయిలో 127.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం
ఈ ఏడాది యాసంగిలో రికార్డు స్థాయిలో 127.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఆశించవచ్చని తెలిపారు. వానకాలం మరియు యాసంగి కలిపి మొత్తం 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్రానికి దిగుబడి వస్తుందని మంత్రి తెలిపారు. ఈ ధాన్యం మొత్తాన్ని సమర్థవంతంగా సేకరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 8,329 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కేంద్రాల ద్వారా మొదటివిగా 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ధేశించారని చెప్పారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఎక్కడా అంతరాయం కలగవద్దు
ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఎక్కడా అంతరాయం కలగకుండా చూడాలని, అవసరమైన వాటర్ ఫెసిలిటీ, తూకం, ట్రాన్స్పోర్ట్, గోదాముల నిర్వహణ వంటి అంశాలపై ముందుగానే చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు మంత్రి ఉత్తమ్ సూచించారు. రైతులకు నష్టమొచ్చే పరిస్థితులు రాకుండా, వారికి త్వరితగతిన చెల్లింపులు జరగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.