Pahalgam Terror attack : కాంగ్రెస్ ఎంపీ, మాజీ దౌత్యవేత్త శశి థరూర్ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ దాడిపై స్పందించారు. ఏదో ఒక రూపంలో బహిరంగ సైనిక ప్రతిస్పందన అనివార్యమని ఆయన అన్నారు. పాకిస్తాన్ తీరు గత పాతికేళ్లుగా ఇదే విధంగా ఉందని, సరిహద్దు దాటి ఉగ్రవాదులకు శిక్షణ, ఆయుధాలు అందిస్తున్నప్పటికీ, భారత్లో జరిగే దాడులకు తమకు సంబంధం లేదని పాక్ ఎప్పుడూ నిరాకరిస్తూనే ఉంటుందని థరూర్ విమర్శించారు. సరిహద్దు ఆవలి నుంచి ఉగ్రవాదులను ప్రోత్సహించడం, శిక్షణ ఇవ్వడం, ఆయుధాలు సమకూర్చడం, కొన్నిసార్లు మార్గనిర్దేశం చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత పాకిస్తాన్ ఎలాంటి బాధ్యత తమపై లేదని చెబుతుంది. చివరికి, విదేశీ నిఘా సంస్థలతో సహా అందరి దర్యాప్తులో పాక్ పాత్ర నిరూపించబడుతుంది అని ఆయన అన్నారు.
ఈసారి ఆ రెండింటి కంటే ఎక్కువ చూడబోతున్నాం
యురీ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా తర్వాత బాలాకోట్ వైమానిక దాడులు జరిగాయి. ఈసారి ఆ రెండింటి కంటే ఎక్కువ చూడబోతున్నామని నేను భావిస్తున్నాను. దౌత్య, ఆర్థిక, నిఘా సమాచార మార్పిడి, రహస్య, బహిరంగ చర్యలు వంటి అనేక మార్గాలు మన ముందు ఉన్నప్పటికీ, ఏదో ఒక రకమైన బహిరంగ సైనిక ప్రతిస్పందన అనివార్యం అని ఎంపీ థరూర్ స్పష్టం చేశారు. 2016 నాటి ఉడీ, 2019 నాటి పుల్వామా దాడుల తర్వాత భారత ప్రభుత్వం ప్రతీకార చర్యలు చేపట్టిందని థరూర్ గుర్తుచేశారు. ఉడీ దాడి తర్వాత సరిహద్దు దాటి సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని, పుల్వామా దాడి అనంతరం బాలాకోట్పై వైమానిక దాడులు జరిగాయని ఆయన పేర్కొన్నారు. దేశం దీనిని కోరుకుంటోంది, ఆశిస్తోంది. ఆ ప్రతిస్పందన ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు ఉంటుందో ఎవరికీ తెలియదు. కానీ కచ్చితంగా ఏదో ఒక ప్రతిచర్య ఉంటుందని నేను నమ్ముతున్నాను అని థరూర్ తెలిపారు.
ఒకవేళ రక్తం ప్రవహిస్తే, అది మా వైపు కంటే వారి వైపే ఎక్కువ
భారతీయులను శిక్షార్హత లేకుండా చంపలేమని పాకిస్తానీయులు అర్థం చేసుకోవాలి. మేము పాకిస్తానీయులను ఏమీ చేయాలనుకోవడం లేదు. కానీ వారు ఏదైనా చేస్తే, మనం ప్రతిస్పందనకు సిద్ధంగా ఉండాలి. ఒకవేళ రక్తం ప్రవహిస్తే, అది మా వైపు కంటే వారి వైపే ఎక్కువగా ప్రవహించే అవకాశం ఉంది అని థరూర్ అన్నారు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంపై పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చీఫ్ బిలావల్ భుట్టో-జర్దారీ చేసిన “రక్తం ప్రవహిస్తుంది అనే వ్యాఖ్యలపైనా థరూర్ స్పందించారు. ఇది కేవలం రెచ్చగొట్టే ప్రసంగం అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు.
Read Also: దేశం వీడకపోతే మూడేళ్ల జైలు!