తెలంగాణ రాజధాని హైదరాబాద్లో మెట్రో రైలుకు మరింత విస్తరణ కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో సేవలను విస్తరించాలని నిర్ణయించిన సీఎం, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రెండో దశ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ద్రాఫ్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్
ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ద్రాఫ్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)ను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. మొత్తం 76.4 కిలోమీటర్ల విస్తరణకు రూ.24,269 కోట్ల వ్యయంతో ఈ ప్రతిపాదనలు రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మెట్రో మార్గాలు కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు మెట్రో లింక్ కల్పించనున్నాయి.
కేంద్రం నుండి అనుమతుల కోసం ఎదురుచూపు
కేంద్రం నుంచి అనుమతులు వచ్చేసరికి పనులు తక్షణమే ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎం సూచించారు. మెట్రో విస్తరణ వల్ల రాబోయే రోజుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తక్కువవై, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పౌర సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.