కొండా సురేఖపై కేటీఆర్‌ పరువునష్టం దావా.. నేడు కోర్టులో విచారణ

Read Time:  1 min
KTRs defamation suit against Konda Surekha. Hearing in court today
KTRs defamation suit against Konda Surekha. Hearing in court today
FONT SIZE
GET APP

హైదరాబాద్‌: స్థాయి మరచి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరువునష్టంపై నాంపల్లి ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టనుంది. తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నాంపల్లిలోని మనోరంజన్‌ కోర్టు ప్రాంగణంలో ఉన్న ప్రజాప్రతినిధుల కోర్టులో కేటీఆర్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం నిరాధారమైన ఆరోపణలు చేశారని అందులో పేర్కొన్నారు.

బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 356 కింద క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్‌ గతంలోనే లీగల్‌ నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేరొన్నారు. ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో మంత్రిపై పరువు నష్టం దావా వేసినట్టు తెలిపారు. తాను ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, తొమ్మిదేండ్లకుపైగా రాష్ట్ర మంత్రిగా పనిచేశానని పిటిషన్‌లో కేటీఆర్‌ పేర్కొన్నారు.

ప్రస్తుతం సిరిసిల్ల నియోజక వర్గ ఎమ్మెల్యేగా, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నానని తెలిపారు. రాష్ర్టానికి ప్రపంచ దేశాలనుంచి పెట్టుబడులు సాధించేందుకు రాష్ట్రం తరఫున విదేశాల్లో జరిగిన అనేక సమావేశాలకు హాజరయ్యానని తెలిపారు. రాష్ట్ర పురోగతికి అంకితభావంతో పనిచేసి పలు సంక్షేమ పథకాల అమలుకు కృషి చేసినట్టు చెప్పారు.

ఈ క్రమంలో పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సైతం అందుకున్నట్టు పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాంటి తనపై మంత్రి సురేఖ నిరాధార ఆరోపణలు చేశారని, ఆమె వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలను, సోషల్‌ మీడియాలోని కథనాలను, పలు టీవీ ఛానల్లో వచ్చిన వార్తలను పెన్‌డ్రైవ్‌లో నిక్షిప్తంచేసి కోర్టుకు సమర్పించారు. పత్రికల్లో వచ్చిన క్లిపింగ్‌లను, ఫోటోలను పిటిషన్‌కు జోడించి దాఖలు చేశారు.

కొండా సురేఖ గతంలో కూడా ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యలు చేసి, ఎన్నికల సంఘంతో చీవాట్లు తిన్న విషయాన్ని కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలను రాజకీయపరమైన వ్యాఖ్యలుగా మాత్రమే కాకుండా ప్రణాళికబద్ధంగా చేసిన కుట్రగా చూడాలని కేటీఆర్‌ తన పిటిషన్‌లోవిజ్ఞప్తి చేశారు. సురేఖ చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని, వాటి వెనుక ఉన్న నేరపూరిత దురుద్దేశాల పరిగణలోకి తీసుకొని, ఆమెకు చట్ట ప్రకారం శిక్ష వేయాలని కోర్టును కోరారు. బాల్క సుమన్‌, సత్యవతి రాథోడ్‌, తుల ఉమా, దాసోజు శ్రవణ్‌లను పిటిషన్‌ సాక్షులుగా చేర్చారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.