హైదరాబాద్: తెలంగాణ సచివాలయ మాజీ సీఎస్ఓ, 17వ పోలీసు బెటాలియన్ కమాండెంట్ గంగారాం (58) మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంతాపం వ్యక్తం చేశారు. పోలీసు శాఖకు ఉన్నతంగా సేవలందిస్తున్న గంగారాం మరణించడం బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

17 వ బెటాలియన్లో విధులు
సిరిసిల్ల లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ చనిపోయారు. తెలంగాణ సచివాలంయలో CSOగా పనిచేసిన గంగారాం ప్రస్తుతం 17 వ బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్నాడు. రాత్రి డిన్నర్ తర్వాత లిఫ్ట్ కోసం థర్డ్ఫ్లోర్కు వెళ్లాడు. లిఫ్ట్ వచ్చిందని భావించి డోర్ ఓపెన్ చేశాడు. దాంతో మూడో ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్పై పడిపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది గంటపాటు శ్రమించి గంగారాంను బయటకు తీశారు.
గంగారాం మృతిపట్ల పోలీసులు సంతాపం
ఆయన్ని హుటాహుటిన ఆస్పత్రి తరలించారు. అప్పటికే గంగారాం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గంగారాంకి భార్య రేఖ, ఒక కొడుకు సతీష్ కుమార్ ఇద్దరు కూతుర్లు గౌతమి, మీనల్ ఉన్నారు. మృతుడి స్వగ్రామం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్ధులం గ్రామానికి చెందిన కుటుంబంగా గుర్తించారు పోలీసులు. గంగారాం మృతిపట్ల పోలీసులు సంతాపం తెలిపారు.