తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా నేడు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ (SIT) అధికారుల ముందు విచారణకు హాజరుకానున్నారు. గత కొంతకాలంగా ఈ కేసులో పలువురు ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు అరెస్ట్ కావడం, వారి వాంగ్మూలాల్లో రాజకీయ పెద్దల ప్రమేయం ఉందని ఆరోపణలు రావడంతో కేసీఆర్ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఎర్రవల్లి ఫామ్హౌస్లో విచారించాలన్న ఆయన విన్నపాన్ని తోసిపుచ్చిన అధికారులు, నేడు హైదరాబాద్లోని నందినగర్ నివాసంలోనే ఆయనను ప్రశ్నించనున్నారు.
HYD : హైదరాబాద్లో మరో కొత్త షాపింగ్ మాల్..ఇందులో విశేషాలు మాములుగా లేవు !!
ఈ విచారణ కోసం సిట్ అధికారులు ఇప్పటికే సమగ్రమైన ప్రశ్నవళిని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్, ఇంటెలిజెన్స్ విభాగం దుర్వినియోగం, మరియు స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ల ధ్వంసం వంటి అంశాలపై కేసీఆర్ను లోతుగా విచారించనున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారా? అధికారులకు నేరుగా ఆదేశాలు వెళ్లాయా? అనే కోణంలో అధికారులు సమాధానాలు రాబట్టనున్నారు. ఈ క్రమంలో నందినగర్ నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
మరోవైపు కేసీఆర్పై విచారణను రాజకీయ వేధింపులుగా బీఆర్ఎస్ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి. దీనికి నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలకు పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపనున్నారు. ప్రధాన రహదారులపై రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ విచారణ అని నేతలు మండిపడుతున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ విచారణ అనంతరం వెలువడే అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి తుఫాను సృష్టిస్తాయోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com