జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే లగ్జరీ, సౌకర్యాలు, ఎలైట్ జీవనశైలి గుర్తుకొస్తాయి. కానీ ఓటు హక్కు వినియోగంలో మాత్రం ఇక్కడి ప్రజలు వెనుకబడి ఉన్నారు. 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నా, ప్రతి ఎన్నికల్లో సగానికి పైగా ఓటర్లు పోలింగ్ బూత్లకు రావడం లేదు. 2018 ఎన్నికల్లో 47.2 శాతం మాత్రమే ఓట్లు నమోదవగా, 2023లో కూడా ఈ సంఖ్య పెద్దగా మారలేదు. కేవలం 47.58% ఓటింగ్ మాత్రమే నమోదైంది. ఇది ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కు పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది.
Latest News: TG: ఈ నెల 19న మహిళలకు చీరల పంపిణీ
ప్రభుత్వం ప్రతి ఎన్నికల రోజున హాలిడే ప్రకటిస్తున్నా, నగర ప్రజలు తమ హక్కును వినియోగించుకోవడంలో ఆసక్తి చూపడం లేదు. “ఓటు వేయడం వల్ల ఏమవుతుంది?” అనే నిర్లిప్త భావన, లేదా “అందరూ వేసినా, ఒక్క నా ఓటు వల్ల ఏ మార్పూ ఉండదు” అనే దృష్టికోణం కారణంగా పోలింగ్ శాతం తక్కువగా ఉంది. కొంతమంది ఆ రోజును ‘లాంగ్ వీకెండ్’గా తీసుకుని నగర బయటకు వెళ్ళిపోతారు. ఈ ధోరణి ప్రధానంగా ఉన్నతవర్గాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. విభిన్న వృత్తులలో ఉన్న వారైనా, సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్నా, ప్రజాస్వామ్యంలో తమ పాత్ర పట్ల నిర్లక్ష్యం చూపడం విచారకరం.

ఈసారి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయంగా కీలకంగా మారడంతో విశ్లేషకులు ఓటింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. పార్టీలు కూడా ఈసారి స్లమ్ ప్రాంతాల నుండి గేటెడ్ కమ్యూనిటీల వరకూ ప్రతి ఓటరిని ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా వ్యూహాలు రచిస్తున్నాయి. యువత, ఐటీ ఉద్యోగులు, మహిళా ఓటర్లు తమ హక్కును వినియోగిస్తేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ఓటు వేసి మార్పును కోరే చైతన్యం పెరిగితేనే, జూబ్లీహిల్స్ పేరుకే కాదు, ప్రజాస్వామ్య చైతన్యంలోనూ ‘లగ్జరీ’గా నిలుస్తుంది.