తెలంగాణలో వర్షాల (Rains) ప్రభావం కొనసాగుతోంది. రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం నుంచి ఆదివారం వరకూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రత్యేకంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాల్లో వర్షాలు భారీగా కురిసే సూచనలు ఉన్నాయి.
వానలు, ఈదురుగాలులు, మెరుపులతో సహా వాతావరణ మార్పులు
వర్షాల సమయంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం మరియు శనివారం వానలు మరింత విస్తృతంగా కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు ఎక్కువగా కురిసే జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు..
గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని (Telangana) పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 8.6 సెం.మీ, బూర్గంపాడ్లో 7.6 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా గార్లలో 8.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో పాటు జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, నల్గొండ, ములుగు వంటి జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.
Read Also : Pasamylaram fire accident: సిగాచీ పరిశ్రమ వద్ద బాధితుల కుటుంబసభ్యుల ఆందోళన