కర్నూలు (Kurnool ) వ్యవసాయ మార్కెట్లో తాజాగా చోటుచేసుకున్న సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పంటకు సరైన మద్దతు ధర లేక రైతులు ఇప్పటికే ఇబ్బందులు పడుతుంటే, ప్రజలు ఉచితమని వినగానే బండెనక బండి కట్టి ఉల్లి (Onion) బస్తాలను ఎత్తుకెళ్లడం పరిస్థితిని మరింత విషాదకరంగా మార్చింది. బైక్లు, ఆటోలు, సైకిళ్లు లేకపోతే నడుచుకుంటూ మరీ ప్రజలు మార్కెట్ వద్దకు చేరి అందినకాడికి ఉల్లి బస్తాలను తీసుకెళ్లారు. ఒకరు మొదలుపెట్టగానే ‘ముందుకు పదండి’ అన్నట్లుగా మరికొందరు కూడా తరలిపోయి పెద్ద ఎత్తున బస్తాలను దోచుకెళ్లడం అక్కడి పరిస్థితిని అదుపులో పెట్టలేనిదిగా మార్చింది.
గత కొద్దికాలంగా కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లిపాయలు పెద్ద ఎత్తున చేరుతున్నాయి. అయితే రేట్లు పతనం కావడంతో వ్యాపారులు తక్కువ ధరలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం క్వింటా ఉల్లిని రూ.1200 చొప్పున మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభించింది. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉల్లిని రైతు బజార్లకు తరలించి అమ్మకాలు నిర్వహిస్తోంది. అయితే మిగిలిపోయిన ఉల్లిని బహిరంగ వేలంలో విక్రయించినా ధరలు క్వింటాకు రూ.50 వరకు పడిపోయాయి. దీనివల్ల రైతులు మరింత నష్టపోగా, మార్కెట్ యార్డులో ఉల్లిపాయలు నిల్వ అయ్యిపోవడం మొదలైంది.
ఈ నిల్వ ఉల్లిని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారన్న వార్తలు బయటపడగానే కర్నూలు ప్రజలు ఆగ్రహంతో మార్కెట్కు చేరుకుని, ఉల్లిపాయ బస్తాలను ఎత్తుకెళ్లడం ప్రారంభించారు. కొద్ది సేపట్లోనే ట్రక్కులు, ఆటోలు, బైకులు నిండా ఉల్లిపాయలతో తరలిపోయాయి. అధికారులు, పోలీసులు చేరుకునేసరికి ఎక్కువ భాగం బస్తాలు మాయం అయ్యాయి. మార్కెట్ అధికారులు “డంపింగ్ యార్డుకు తరలిస్తోన్న ఉల్లిని ప్రజలు అపోహతో దోచుకెళ్లారు” అని వివరణ ఇచ్చినా, రైతుల కష్టపడి పండించిన పంట ఇలా విలువలేని స్థితికి చేరుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ సంఘటన వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది.