సిగాచి పరిశ్రమ( Sigachi Industries)లో ఇటీవల చోటుచేసుకున్న ఘోర పేలుడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపేందుకు నలుగురు నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ నెల రోజుల వ్యవధిలో పూర్తి నివేదిక సమర్పించాలని అధికారిక ఆదేశాలు జారీ అయ్యాయి. ఘటన జరిగిన కారణాలు, భద్రతా లోపాలు, సంభవించిన ప్రభావాలపై సమగ్రమైన విచారణ చేయనున్నట్లు సమాచారం.
జాగ్రత్తలపై కమిటీ సిఫార్సులు ఇవ్వాల్సిందిగా ఆదేశం
ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, పర్యావరణ నియమాలు, పరిశ్రమ నిర్వహణ ప్రమాణాలపై కమిటీ నుంచి స్పష్టమైన సలహాలు కోరింది ప్రభుత్వం. పరిశ్రమల పరిపాలనలో అలసత్వం లేకుండా చూడాలని, నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. పర్యావరణ నియంత్రణ సంస్థలపైనా సమీక్ష జరిగే అవకాశం ఉంది.
బాధిత కుటుంబాల ఆవేదన: తమవాళ్ల ఆచూకీ ఏమైందో చెప్పండి
పేలుడు (Blast) జరిగిన మూడు రోజుల తరువాత కూడా తమ కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియకపోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. “మా వాళ్లను మాకు అప్పగించండి” అంటూ ప్రభుత్వాన్ని కోరుతున్న బాధితులు, పరిశ్రమ యాజమాన్య నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. అధికారుల నుంచి సరైన సమాచారం లేకపోవడం, సహాయక చర్యలు ఆలస్యం కావడం వల్ల తమ కష్టాలు ఇంకా పెరిగాయని వాపోతున్నారు.
Read Also : Vamshi : వల్లభనేని వంశీని అరెస్టు చేసి ఏం సాధించారు..? – పేర్ని నాని