Telangana : తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు లేని వారికి కూడా సన్న బియ్యం అందించే కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ సంచలన నిర్ణయంపై సివిల్ సప్లైస్, ఇరిగేషన్ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్చి 28, 2025 నాటి తాజా అప్డేట్లో వివరాలు వెల్లడించారు. చేతిలో రేషన్ కార్డు లేకపోయినా, డిజిటల్ కార్డు ఉంటే సరిపోతుందనీ, అంటే.. రేషన్ డీలర్ దగ్గర లబ్ధిదారుల వివరాలు నమోదై ఉంటే వారికి సన్నబియ్యం అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పేదలందరికీ ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా 89.9 లక్షల రేషన్ కార్డులు
ఈ సన్న బియ్యం పథకం మొదట రేషన్ కార్డు ఉన్నవారికి ఏప్రిల్ 1, 2025 నుంచి అమలులోకి రానుంది. అయితే, రేషన్ కార్డు దగ్గర లేని వారికి కూడా ఈ సౌలభ్యం విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఉగాది (మార్చి 30, 2025) నాడు హుజూర్నగర్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 89.9 లక్షల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలతో పాటు, కొత్తగా దరఖాస్తు చేసిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల సన్న బియ్యం ఉచితంగా అందజేయనున్నారు.
కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా త్వరలో పూర్తి
సన్న బియ్యం పొందేందుకు రేషన్ డీలర్ దగ్గర లబ్ధిదారుడి వివరాలు నమోదై ఉండాలి. రేషన్ కార్డు లేని వారు తమ వివరాల్ని డీలర్కి చెప్పి, ప్రూఫ్ కోసం ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ చెప్పవచ్చు. వాటి ద్వారా డీలర్ తన దగ్గర లబ్దిదారుల వివరాల్ని పరిశీలిస్తారు. అక్కడ ఆ వివరాలు కనిపిస్తాయి. దాంతో వారిని గుర్తిస్తారు. అలా రేషన్ షాపుల్లో సన్న బియ్యం తీసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా త్వరలో పూర్తవుతుందనీ, సుమారు 30 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు.