మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాకముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటమిని పరోక్షంగా ఒప్పుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తుందని అర్థం కావడంతోనే, సీఎం అసహనంతో బీజేపీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆయనకు పరాజయం తథ్యమని అర్థమవుతోందని, అందుకే బీజేపీపై అవాకులు పేలుతున్నారని విమర్శించారు. అభివృద్ధిపై చర్చించాల్సింది పోయి, కేవలం విమర్శలకే పరిమితం కావడం రేవంత్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనమని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ponnam Prabhakar: పట్టణం చుట్టూ రింగు రోడ్డుతో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చదువుతున్న స్క్రిప్ట్ అంతా “దారుస్సలాం” (ఎంఐఎం కార్యాలయం)లో తయారవుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ మరియు ఎంఐఎం పార్టీలు తెర వెనుక ఒకే తాటిపై ఉంటూ, హిందూ ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. తన వైఫల్యాలను ఇతరుల మీదకు నెట్టడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని, పదేళ్లు కేంద్రంలో ఉన్న బీజేపీ ఏమీ చేయలేదని అనడం హాస్యాస్పదమని అన్నారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు అందించిన నిధులపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు.
కేసీఆర్ కుటుంబ సభ్యుల అరెస్ట్ అంశంపై కూడా బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేకపోతే, ఆ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకుంటూ తమకు ఒక లేఖ రాయాలని సూచించారు. “అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు అని రేవంత్ చెబితే, వాళ్ల సంగతి మేము చూసుకుంటాం” అంటూ ఆయన సవాల్ విసిరారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే గూటి పక్షులని, కేవలం నాటకాలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు బీజేపీకి పట్టం కట్టడం ద్వారా రేవంత్ రెడ్డి అహంకారానికి చరమగీతం పాడుతారని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com