తెలంగాణలోని నైనీ కోల్ బ్లాక్ టెండర్ల రద్దు అంశం అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారంపై తెలంగాణ బిజెపి (TBJP) సీనియర్ నేత రామచందర్ రావు తాజాగా ఘాటు వ్యాఖ్యలు చేసారు. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలు ముఖ్యమంత్రికి, మంత్రులకు మధ్య ఉన్న అంతర్గత విభేదాలను బట్టబయలు చేశాయని రామచందర్ రావు విమర్శించారు. ప్రభుత్వంలోని పెద్దలు తమ బంధువులకు, సన్నిహితులకు ఈ గనులను కేటాయించుకోవాలని పథకం వేశారని ఆయన ఆరోపించారు. అయితే, ఈ అక్రమాలపై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో, బయటపడతామనే భయంతోనే ప్రభుత్వం హడావుడిగా టెండర్లను రద్దు చేసిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇది కేవలం టెండర్ల రద్దుతో ముగిసిపోయే అంశం కాదని, దీని వెనుక ఉన్న అసలు కుట్రను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
Finance: కోలుకుంటున్న తెలంగాణ ప్రభుత్వ ఖజానా
ఈ గనుల కేటాయింపు వ్యవహారంలో భారీ స్థాయిలో క్విడ్ ప్రో కో (Quid Pro Quo) జరిగిందనే అనుమానాలను రామచందర్ రావు వ్యక్తం చేశారు. అందుకే దీనిపై కేవలం రాష్ట్ర స్థాయి విచారణ సరిపోదని, సిబిఐ (CBI) లేదా మరేదైనా స్వతంత్ర కేంద్ర విచారణ సంస్థతో లోతైన దర్యాప్తు జరిపించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. బాధ్యులు ఎంతటి వారైనా వదిలిపెట్టకూడదని, ప్రజల ఆస్తి అయిన బొగ్గు గనులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం వెనుక ఉన్న సూత్రధారులను కఠినంగా శిక్షించాలని కోరారు.
ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీపై కూడా రామచందర్ రావు విమర్శలు గుప్పించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసే నైతిక అర్హత బీఆర్ఎస్కు లేదని ఆయన స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వరకు జరిగిన అన్ని అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన దోపిడీకి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణికి పెద్ద తేడా లేదని, రెండు పార్టీలు ప్రజలను వంచిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com