తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ (TSRTC) ఉద్యోగులు వివిధ డిమాండ్లతో మే 7నుంచి సమ్మెకు సిద్ధమవుతున్నారు. గతంలో ఇచ్చిన హామీలపై స్పందన లేకపోవడంతో, ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం చర్చలకు తాము సిద్ధమని, పంతాలు పక్కనపెట్టి సమస్యలు చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో సమ్మె వల్ల జరిగిన తీవ్ర పరిణామాలను గుర్తు చేస్తూ, అలాంటి పరిస్థితులు మళ్లీ రాకూడదన్నది రేవంత్ లక్ష్యం.
గత అనుభవాలు – కేసీఆర్ పాలనలో తీవ్ర పరిణామాలు
కేసీఆర్ ప్రభుత్వం కాలంలో 55 రోజుల పాటు సాగిన ఆర్టీసీ సమ్మె తీవ్రంగా దెబ్బతీసింది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఉద్యోగులు మానసికంగా, ఆర్థికంగా దెబ్బతిని, పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయినా ప్రభుత్వం ఒడిగట్టకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర అసహనానికి దారి తీసింది. చివరకు ఉద్యమాన్ని విరమించిన తర్వాతే కొంతవరకు ఉద్యోగుల డిమాండ్లపై స్పందించారు. ఈ పరిణామాలు గుర్తు చేసుకుంటూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం సానుకూలంగా వ్యవహరించాలని, అదే సమయంలో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను కూడా బహిరంగంగా ఉద్యోగుల ముందుంచాలని భావిస్తున్నారు.
రెవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు సమస్యల గుట్టు
రాష్ట్రానికి తగినంత ఆదాయం లేకపోవడం, గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం ఇంకా కొనసాగుతున్న కారణంగా ఉద్యోగుల డిమాండ్లను తక్షణమే నెరవేర్చడం సాధ్యపడడం లేదు. రేవంత్ రెడ్డి సమ్మెను అరికట్టగలిగితే, ప్రజలలో తన ప్రభుత్వం పట్ల మంచి అభిప్రాయం ఏర్పడే అవకాశముంది. అయితే ఒక వర్గానికి ఇచ్చే సానుకూల నిర్ణయాలు ఇతర ఉద్యోగ సంఘాలకు ప్రేరణగా మారి మరిన్ని సమ్మెలు చెలరేగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ పరిస్థితిని సీఎం ఎలా సమర్థంగా డీల్ చేస్తారు అన్నది రాబోయే రోజుల్లో ఆసక్తికరమైన అంశంగా మారనుంది.
Read Also : Vaishnavi: ఒకేసారి 5 బ్యాంకు పోస్టులు కొట్టేసిన వైష్ణవి