ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం (AP Cabinet Meeting) అక్టోబర్ 3న జరగనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా అన్ని శాఖల నుంచి సమగ్ర ప్రతిపాదనలు కోరుతూ, అక్టోబర్ 1న సాయంత్రం 4 గంటలలోపు వాటిని పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే, ఈ తేదీతో సచివాలయ ఉద్యోగుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. ఎందుకంటే అక్టోబర్ 2న దసరా (Dasara), అలాగే 4వ తేదీ శనివారం, 5వ తేదీ ఆదివారం ప్రభుత్వ సెలవులు ఉన్నాయి. దీంతో, అక్టోబర్ 3న సెలవు తీసుకుంటే ఉద్యోగులకు వరుసగా నాలుగు రోజుల హాలిడే లభిస్తుందని వారు ముందుగానే భావించారు. సొంత ఊళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో పండుగను జరుపుకోవచ్చని అనుకున్నారు. కానీ, అక్టోబర్ 3న కేబినెట్ సమావేశం పెట్టడంతో ఆ అవకాశం కోల్పోయారు.
ఈ పరిణామం ఉద్యోగుల్లో అసంతృప్తి కలిగించినప్పటికీ, ప్రభుత్వ పరంగా మాత్రం ఈ సమావేశానికి ప్రాధాన్యం ఉంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన అత్యవసర అంశాలు, పలు విభాగాల కీలక ప్రతిపాదనలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల సమీక్ష వంటి విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పండుగ సెలవుల మధ్యలోనైనా కేబినెట్ భేటీ నిర్వహించడం ప్రభుత్వ అత్యవసర ప్రాధాన్యతను సూచిస్తుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.