తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ భేటీపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్కు ఒకరోజు ముందే ఈ భేటీ జరగడం ఉద్దేశపూర్వకమా? అనే ప్రశ్నను బీఆర్ఎస్ ఎత్తిపొడుస్తోంది. రేవంత్ రెడ్డి “మేము గెలిచినా, ఓడినా మాకు పెద్దగా ఫరక్ పడదు” అన్న వ్యాఖ్యల వెనుక దాగి ఉన్న మర్మం ఏమిటని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాక, భేటీ సమయంలో ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరి ముఖాల్లోనూ కనిపించిన ఆనందం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలు ఉన్నాయి? అనే దానిపై బీఆర్ఎస్ అనుమానాలను వ్యక్తం చేసింది.

రాహుల్ అపాయింట్మెంట్ కష్టంగా, మోడీ అపాయింట్మెంట్ సులభంగా?
బీఆర్ఎస్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా రేవంత్ రెడ్డి-మోడీ భేటీ ఫొటోను షేర్ చేస్తూ ఆసక్తికర ప్రశ్నలను లేవనెత్తింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకకపోవడం, కానీ ప్రధాని మోడీ అపాయింట్మెంట్ సులభంగా దొరకడం వెనుక మర్మం ఏమిటని ప్రశ్నించింది. ఇది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ మధ్య అంతర్గత అంగీకారం ఉందన్న అనుమానాలకు దారితీస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. తెలంగాణలో కాంగ్రెస్-బీజేపీ మద్ధతుతోనే పాలన సాగుతోంది అని బీఆర్ఎస్ ఆరోపించింది.
రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీపై ఒత్తిడి
ఈ అంశాన్ని బీఆర్ఎస్ తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య గూఢ ఒప్పందం ఉందని ప్రచారం చేయడానికి ఉపయోగిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీయడానికి, అదే సమయంలో బీజేపీకి ఓటమిని సొంతం చేసుకునేలా వ్యూహం రచిస్తోంది. అయితే, రేవంత్-మోడీ భేటీ నిజంగా రాజకీయ డీల్ కోసం జరిగిందా, లేక కేవలం అధికారిక భేటీ మాత్రమేనా అన్నదానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. రాబోయే రోజుల్లో ఈ ఆరోపణలు మరింత వేడెక్కే అవకాశముంది.