ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య విద్యను బలోపేతం చేయడమే తమ పార్టీ విధానమని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పునరుద్ఘాటించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కాలేజీలు ఉంటేనే సామాన్య, పేద విద్యార్థులకు ఉచితంగా లేదా తక్కువ ఫీజుతో వైద్య విద్య అందుతుందని, ప్రైవేటీకరణ వల్ల విద్య వ్యాపారమయమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని, భవిష్యత్తులో వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
Harish Rao: KCR ప్రెస్మీట్తో రేవంత్ సర్కార్ పూర్తి డిఫెన్స్లో పడింది
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని బొత్స సత్యనారాయణ ఘాటు విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కేవలం సినిమాల్లో మాత్రమే హీరో అని, రాజకీయాల్లో ఆయనొక “కాగితం పులి” అని ఎద్దేవా చేశారు. పవన్ తన సినిమా డైలాగులు, ఘాటైన భాషను (పీకుడు భాష) పక్కన పెట్టి, ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై దృష్టి సారించాలని సూచించారు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గిందని, కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో తన బలాన్ని చూపించాలని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాలను గుడ్డిగా సమర్థించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన “కోటి సంతకాల సేకరణ”పై మంత్రి సత్యకుమార్ చేసిన విమర్శలకు బొత్స గట్టి కౌంటర్ ఇచ్చారు. కోటి సంతకాలు ఎవరు పెట్టారు? ఎక్కడి నుంచి వచ్చాయి? అని ప్రశ్నించే బదులు, మంత్రి తన సొంత గ్రామానికి వెళ్లి ప్రజలను అడగాలని సూచించారు. ప్రభుత్వ కాలేజీని ప్రైవేటు పరం చేయడం మీకు ఇష్టమేనా అని ప్రజలను అడిగితే అసలు వాస్తవాలు తెలుస్తాయని సవాల్ విసిరారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను గమనించకుండా, కేవలం విమర్శలు చేయడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com