Bandi Sanjay : ఈ బిల్లును మతం కోణంలో చూడవద్దని విజ్ఞప్తి : బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒవైసీ వంటి వారు వందమంది వచ్చినా ఈ బిల్లును ఆపలేరని స్పష్టం చేశారు. ఒవైసీ తాత వచ్చినా ఈ బిల్లు ఆగదని, దేశంలోని ముస్లిం మేధావులు, సమాజం కూడా దీనికి మద్దతుగా ఉన్నారని పేర్కొన్నారు. ఒవైసీ ఒక్కడివల్ల ఈ బిల్లు ఆగుతుందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ బిల్లును తీసుకురావాలనుకున్నప్పుడే తనకు కరీంనగర్లోని పేద ప్రజలు గుర్తుకు వచ్చారని అన్నారు.కరీంనగర్ జిల్లా కోర్టు కాంప్లెక్స్లో న్యాయవాదుల డిజిటల్ లైబ్రరీ కోసం కేంద్ర సహాయ మంత్రి రూ. 15 లక్షలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు బండి సంజయ్ను ఘనంగా సన్మానించారు.

అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే ఈ బిల్లు ఆమోదం పొందుతుందని తెలిపారు.ఈ బిల్లును మతపరంగా చూడడం తగదని బండి సంజయ్ స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం దేశ అభివృద్ధి కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడదని చెప్పారు. వక్ఫ్ బోర్డు పేరిట పేదలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఆ విషయాన్ని అందరికీ తెలియజేయాలన్నారు.కరీంనగర్లో ఒక పేద వ్యక్తి ఇల్లు నిర్మించుకోవడానికి అనుమతి తీసుకుంటే, అది వక్ఫ్ బోర్డు స్థలం అంటూ అధికారులు అడ్డుకున్న ఘటనను ఆయన ఉదహరించారు.
ఆ వ్యక్తి తాత, ముత్తాతల కాలం నుంచే ఆ ఇంట్లో నివసిస్తున్నారని తెలిపారు. కొందరు లౌకికవాదులు, ఒవైసీ వంటివారు ఈ బిల్లుకు మతరంగు అద్దాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజల హక్కుల కోసం తాను ఎన్నో పోరాటాలు చేసినట్లు గుర్తు చేశారు. పోరాటాల్లో భాగంగా కొన్ని సందర్భాల్లో జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చిందని, అప్పుడు న్యాయవాదులు తనకు అండగా నిలిచారని అన్నారు. కోర్టు వద్ద చెట్లు తొలగించిన ఘటనలోనూ, పాకిస్థాన్-భారత్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ జెండాలు పట్టుకున్న వారి మీద పోరాడినపుడు కూడా తాను జైలుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.