ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ రంగంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ మళ్లీ ఊపందుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఎంపికైన 1,286 మంది జూనియర్ లెక్చరర్లకు (JL) రేపు అధికారికంగా నియామక పత్రాలు (Appointment Letters) అందజేయనున్నట్లు సమాచారం. ఈ నియామకాలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించి, అభ్యర్థులకు లెటర్లు అందజేయనున్నారు. ఇప్పటికే వీరికి పోస్టింగ్లు కేటాయించినప్పటికీ, ఎన్నికల నియమావళి కారణంగా నియామక ప్రక్రియ ఆలస్యమైంది.
ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ
ప్రభుత్వం ఇటీవల విద్యా రంగంలో కొత్త ఉపాధ్యాయ నియామకాలకు పూనుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంది. అర్హత సాధించిన అభ్యర్థులు గత నెలలోనే ఎంపిక చేయబడగా, ఇప్పుడు అధికారికంగా నియామక పత్రాలు అందుకుంటున్నారు. నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం ఎక్కడ నిర్వహిస్తారనే వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విధులు
ఈ నియామకాలతో రాష్ట్రంలో విద్యా రంగానికి మరింత బలాన్నిచ్చే అవకాశముంది. కొత్తగా నియామకమైన అధ్యాపకులు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విధులు చేపట్టనుండటంతో, విద్యార్థులకు మెరుగైన బోధన అందే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల కొరతతో ఇబ్బంది పడుతున్న పలు కళాశాలలకు ఈ నియామకాలు ఎంతో ఉపయోపడతాయని విద్యా శాఖ అధికారులు తెలిపారు.
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకునే అవకాశం
ఈ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం మరిన్ని ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్లు, డిగ్రీ లెక్చరర్లు, ఇతర విద్యాసంస్థల ఖాళీల భర్తీపై చర్చలు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ రంగంలో అందుబాటులోకి వచ్చే అవకాశముండటంతో, నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.