తెలంగాణలో నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభం..

Read Time:  1 min
House to house survey to start in Telangana from today
House to house survey to start in Telangana from today
FONT SIZE
GET APP

హైదరాబాద్‌: తెలంగాణలో ఈరోజు నుండి ఇంటింటి సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలెక్టర్లు ఏనుమరెటర్లతో విస్తృతంగా మాట్లాడాలని అన్నారు. శనివారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతుంటాయని తెలిపారు. కలెక్టర్లు ఎనుమరెటర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడితే ప్రజల సందేహాలు ఏంటో వెను వెంటనే తెలుసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రజల సందేహాలను కలెక్టర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి ప్రజల అనుమానాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని ఆదేశించారు.

సమగ్ర కుటుంబ సర్వే చాలా పెద్ద కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాన్ని ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళుతున్న అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువ సార్లు సర్వేలో భాగస్వాములు అయ్యేలా చూడాలని అధికారులను కోరారు. క్వశ్చనీర్ పకడ్బందీగా రూపొందించారు, ఎనిమరేటర్లకు బాగా శిక్షణ ఇచ్చారు, హౌస్ లిస్ట్ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఇదే రీతిలో కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఈ దేశంలో జరిగే అతిపెద్ద కార్యక్రమం ఇది.. మనం చూపే నిబద్ధతపైనే ఈ సర్వే విజయవంతం అవడం ఆధారపడి ఉంటుంది అన్నారు. యావత్ దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న కుటుంబ సర్వేను గమనిస్తుందని వివరించారు.

జిల్లా కలెక్టర్లు ప్రతి చిన్న విషయం కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్న అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ దేశంలో ప్రగతిశీల భావాలను, కార్యక్రమాలను వ్యాప్తి చేయడానికి ఈ సర్వే గొప్పగా ఉపయోగపడుతుందని తెలిపారు. సర్వేపై కలెక్టర్లతో పాటు అన్ని స్థాయిలోని అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ప్రధానంగా పట్టణాలపై దృష్టి పెట్టాలని కోరారు. కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ శాంత కుమారి, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాన్య యితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కాగా, ఈ నెల 9 నుంచి ప్రభుత్వం ముద్రించిన ఫార్మాట్‌లో కుటుంబ వివరాలను ఎన్యూమరేటర్లు సేకరించి నమోదు చేస్తారు. అందులో 56 ప్రధాన ప్రశ్నలు, 19 అనుబంధ ప్రశ్నలు కలిపి మొత్తం 75 ప్రశ్నలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. పార్ట్‌-1, పార్ట్‌-2 కింద 8 పేజీల్లో ఆయా వివరాలను ఎన్యూమరేటర్లు నమోదు చేస్తారు. కాగా, ప్రతి ఒక్క కుటుంబ యజమాని ఎన్యుమరేటర్‌కు సరైన సమాధానం ఇవ్వా్ల్సి ఉంటుంది. కుటుంబ యజమాని ఎవరు?, ఆ ఇంట్లో ఉండే మొత్తం కుటుంబాలు ఎన్ని? అనే సమాచారం తెలియజేయాలి. ఈ సర్వేలో కిరాయిదారులు వారు ప్రస్తుతం ఉన్న ఇంట్లో కానీ, వారి స్వగ్రామంలో కానీ సర్వే చేయించుకోవచ్చు. ఉపాధి కొరకు వేరే ప్రాంతాల్లో ఉంటే నమ్మకస్థులు లేదా బంధువుల ద్వారా కుటుంబ వివరాలు ఎన్యుమరేటర్‌కు తెలపాల్సి ఉంటుంది.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.