సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు

Read Time:  1 min
PM Modi wishes CM Revanth Reddy on his birthday
PM Modi wishes CM Revanth Reddy on his birthday
FONT SIZE
GET APP

హైదరాబాద్‌: ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 55వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి నల్లగొండి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మొదట యాదాద్రి ఆలయానికి చేరుకుని లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. అయితే సీఎం పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తన ట్వీట్ లో ప్రధాని ఇలా రాసుకొచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయువు , ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రార్థిస్తున్నాను అని రాసుకొచ్చారు.

కాగా, కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్‌లో యాదాద్రికి చేరుకున్నారు. ఇంకాసేపట్లో లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. దర్శనానంతరం ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తారు. ఆ తరువాత మిషన్ భగీరథలో భాగంగా నిర్మించదలిచిన పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. పైలాన్‌ను ఆవిష్కరిస్తారు.

సిద్దిపేట్ జిల్లా మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో 500 గ్రామాలకు మంచినీటిని అందించడానికి నిర్మించ తలపెట్టిన ప్రాజెక్ట్ ఇది. నిర్మాణ వ్యయం 210 కోట్ల రూపాయలు. మధ్యాహ్నం 2:10 నిమిషాలకు సంగెం వెళ్తారు రేవంత్ రెడ్డి. భీమలింగం వంతెన వరకు మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రలో పాల్గొంటారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తారు.

మరోవైపు భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కిషన్ అద్వానీ పుట్టిన రోజు కూడా నేడే. 97వ సంవత్సరంలోకి అడుగు పెట్టారాయన. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను అందుకున్న తరువాత ఆయన జరుపుకొంటోన్న మొదటి జన్మదిన వేడుకలు ఇవే.

ఈ సందర్భంగా ఆయనకు మోడీ జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సంవత్సరం మరింత ప్రత్యేకమైనదని, దేశానికి విశిష్ట సేవలను అందించినందుకు భారతరత్న పురస్కారం లభించిందని గుర్తు చేశారు. ప్రజలు అమితంగా ఆరాధించే రాజనీతిజ్ఞుల్లో అద్వానీ ఒకరని, దేశాభివృద్ధి కోసం తనను తాను అంకితం చేసుకున్నారని కొనియాడారు మోడీ.

కాగా, శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి తన జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అలాగే ఆలేరు నియోజకవర్గాల్లోని పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవం కార్యక్రమంలో భాగంగా నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.సమీక్ష అనంతరం సంగెం నుంచి మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రను చేపడతారు. సంగెం నుంచి భీమలింగం వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. పాదయాత్రలో భాగంగా మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి సీఎం ప్రసంగిస్తారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.