విశాఖపట్నం, జనవరి 31, ప్రభాతవార్త : కేంద్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని.., దీనికోసం వామపక్ష, లౌకిక పార్టీలతో కలిసి పనిచేస్తాయని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా వెల్లడించారు.
విశాఖలో గురు, శుక్రవారాల్లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రజావ్యతిరేక పాలనపై భగత్ సింగ్ వర్ధంతి మార్చి 23వ తేదీ నుంచి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రచార ఉద్యమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. దేశంలో ప్రజల మధ్య ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలంటే బిజెపిని అధికారం నుంచి దించాలని అన్నారు. సిపిఐ శతజయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడలో డిసెంబర్ 24, 25 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తామని, దీనికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఉన్న కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధులను ఆహ్వానిస్తామని తెలిపారు. డిసెంబర్ 25న శతవార్షికోత్సవాల ముగింపు సభను ఖమ్మంలో నిర్వహించనున్నట్టు చెప్పారు. దేశంలో ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని, ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని, విదేశీ అప్పు 700 బిలియన్ డాలర్లకు చేరుకుందని, రూపాయి విలువ భారీగా పడిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగం పెరిగి యువతలో నిస్పృహ అలుముకుంటోందని, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని.. బిజెపి చెపుతున్న వికసిత భారత్ ఎక్కడా కనిపించడం లేదని రాజా విమర్శించారు.
రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చిందని.., కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని తెలిపారు. బిజెపి పాలనలో రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి పెనుముప్పు మంచి ఉందని.. దేశ ప్రజలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై పార్లమెంటులో హోం మంత్రి అమిత్ షా అవమానకరంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించామని, అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 31న వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమం నిర్వహించాయని అయినా ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై నోరు ఎత్తడం లేదని విమర్శించారు.
ఛత్తీస్గడ్ ఎన్ కౌంటర్లపై సిపిఐ నిజ నిర్ధారణ కమిటీ నిజానిజాలను నిగ్గుతేలుస్తుందని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మేధావులను జైలుకు పంపుతున్నారని, వారికి బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారని, ప్రశ్నిస్తున్న గొంతులను కేంద్ర ప్రభుత్వం అణిచివేస్తోందని రాజా అన్నారు. 1991 ప్రార్థన స్థలాల చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు.
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు సిపిఐ పూర్తిగా వ్యతిరేకమని, కార్యవర్గ సమావేశాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసినట్టు తెలిపారు. సిపిఐ జాతీయ మహాసభలు సెప్టెంబర్ 21 నుంచి 25 వరకు చండీగఢ్ లో నిర్వహించనునట్టు తెలిపారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించబోమని కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం సొంత గనులు ఇస్తామని కేంద్రం చెప్పలేదని, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కేంద్ర ప్రభుత్వం చూపించలేదని విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం లౌకిక రాజ్యం విధానానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తోందని విమర్శించారు. పార్టీ శతవార్షికోత్సవాల ముగింపు కార్యక్రమం డిసెంబర్ 26న ఖమ్మంలోనూ, డిసెంబర్ 24, 25 తేదీల్లో విజయవాడలో అంతర్జాతీయ సదస్సు లు జరపాలని కార్యవర్గ సమావేశం నిర్ణయం మేరకు ఈ కార్యక్రమాల విజయవంతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో శుక్రవారం రాష్ట్రపతి ప్రసంగములు కుంభమేళా ప్రమాదాలపై ప్రస్తావన లేదని విమర్శించారు.
సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు అజీజ్ పాషా, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణ మూర్తి, సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.
