కొత్తగా ఆరుగురికి మంత్రివర్గంలో చోటు..
పాట్నా : ఈ రోజు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు తెలిసింది. క్యాబినెట్లోకి కొత్తగా ఆరుగురికి చోటు కల్పించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వారిలో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు , ఇద్దరు జేడీయూ ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ నితీశ్ కుమార్ తన క్యాబినెట్ను విస్తరించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

దిలీప్ జైస్వాల్ తన పదవికి రాజీనామా
బుధవారం సాయంత్రం 4 గంటలకు క్యాబినెట్ విస్తరణ జరగనున్నట్లు తెలిసింది. కొత్తగా మంత్రివర్గంలో చేరే ఆ ఆరుగురు ఎవరో అప్పుడే స్పష్టత రానుంది. కాగా ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కడంతో రెవెన్యూ మంత్రి దిలీప్ జైస్వాల్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే పార్టీ పాలసీకి అనుగుణంగా తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది ఆఖరులో బీహార్ అసెంబ్లీ గడువు
దిలీప్ రాజీనామాతో ఒక బెర్తు ఖాళీ అవుతుండగా.. కొత్తగా మరో ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. అంటే బీహార్ క్యాబినెట్లో ఐదుగురు మంత్రులు పెరగనున్నారు. కాగా, ఈ ఏడాది చివరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం బీజేపీ, జేడీయూలతో కూడిన సంకీర్ణ సర్కారు కొనసాగుతుంది. అంతకుముందు ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్.. ఆ క్యాబినెట్ను రద్దు చేసి బీజేపీతో కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీర్చారు. ఈ ఏడాది ఆఖరులో బీహార్ అసెంబ్లీ గడువు ముగియనుంది.