సూపర్ స్టార్ మహేష్ బాబు ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించబడిందన్న వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల సమయంలో ఇలాంటి సమస్యలు ఎదురవడం సాధారణమే అయినప్పటికీ, మహేష్ బాబు లాంటి ప్రముఖుడి పేరు ఓటర్ లిస్టులో ఉండి, ఆపై తొలగించబడడం ఆశ్చర్యం కలిగించే విషయంగా మారింది. కృష్ణ-గుంటూరు పట్టభద్రుల శాసన మండలి ఓటర్ల జాబితాలో మహేష్ బాబు పేరుతో ఓటు నమోదు అయ్యింది. అయితే, ఎన్నికల కమిషన్ ఆ ఓటును తొలగించింది. ఈ విషయాన్ని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, ఏఈఆర్వో చల్లా ఓబులేసు మీడియాకు వెల్లడించారు. దీనికి ప్రధాన కారణం మహేష్ బాబు ఓటు తప్పుగా నమోదు అవ్వడమే అని అధికారులు స్పష్టం చేశారు.

ఎన్నికల నియమావళి ప్రకారం… బూత్ లెవెల్ అధికారులతో విచారణ జరిపించిన అనంతరం మహేష్ బాబు ఓటును తొలగించినట్లు అధికారులు తెలిపారు. గుంటూరు అర్బన్లో నమోదైన దరఖాస్తులపై పరిశీలన చేసి, అనర్హమైన లేదా తప్పుగా నమోదైన ఓట్లను తొలగించే ప్రక్రియలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు.
ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాలో తప్పులు సంభవించడం కొత్తేమీ కాదు. చాలా మంది పట్టభద్రులు తమ ఓటు కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ, మహేష్ బాబు లాంటి సెలబ్రిటీ పేరు ఈ లిస్టులో ఉండడం, ఆపై తొలగించబడడం చాలా మందిలో ఆసక్తిని కలిగించింది.
ఈ వార్తపై మహేష్ బాబు అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “మహేష్ బాబు నిజంగా ఎమ్మెల్సీ ఓటర్ కాదా?” అన్న చర్చ నడుస్తోంది. ఎన్నికల అధికారుల ప్రకారం, ఇది సాదారణ ప్రక్రియలో జరిగిన తప్పిదమే. అయితే, రాజకీయంగా కూడా ఈ అంశం ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక దిగ్గజం రాజమౌళి తో కలిసి ‘ఎస్ఎస్ఎంబి 29’ (SSMB 29) అనే పాన్ వరల్డ్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. జనవరిలోనే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో మొదలుకాగా, ఫస్ట్ షెడ్యూల్ సైతం పూర్తయినట్టు టాక్ నడుస్తోంది.