హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు త్వరలో ఛార్జీల పెంపు రూపంలో ఊహించని భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి. మెట్రో సేవలను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ సంస్థ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్టు సమాచారం. కోవిడ్-19 సమయంలో ప్రయాణికుల రాకపోకలు తగ్గిపోవడం వల్ల వచ్చిన నష్టాలు ఇంకా తేరుకోకపోవడంతో, దాదాపు రూ. 6,500 కోట్ల నష్టం వాటిల్లినట్టు కంపెనీ వెల్లడించింది.
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఛార్జీలను పెంచడం
ఈ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఛార్జీలను పెంచడం తప్పనిసరిగా మారిందని ఎల్ అండ్ టీ భావిస్తోంది. ఇప్పటికే బెంగళూరు మెట్రో ఛార్జీలను 44 శాతం పెంచిన నేపథ్యంలో, హైదరాబాద్లో కూడా ఇదే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఈ నిర్ణయానికి పునాది వేస్తూ, సంస్థ ఇటీవల రూ. 59 హాలిడే సేవర్ కార్డు, పీక్ అవర్స్ డిస్కౌంట్లను సైలెంట్గా రద్దు చేసింది. వీటిని చూసిన ప్రయాణికులు త్వరలో ఛార్జీలు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రయాణికులపై పెనుభారం
నగర వాసులు పెద్ద సంఖ్యలో మెట్రో సేవలను నమ్ముకుని ప్రయాణిస్తున్న నేపథ్యంలో, ఛార్జీల పెంపు నిర్ణయం వారికి గణనీయమైన ఆర్థిక భారం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, నష్టాల భారం చూసినట్లయితే, ఛార్జీల పెంపు అనివార్యమేనని భావిస్తున్నారు. ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ దీనిపై త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. ఈ నిర్ణయం మెట్రో ప్రయాణికుల జీవనశైలిపై ప్రభావం చూపనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.