2025 మే నెలలో భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా కప్ టోర్నీ నుంచి భారత్ జట్టు తప్పుకుంటున్నట్లు పలు మీడియా నివేదికలు వెల్లడించాయి.

బీసీసీఐ కీలక నిర్ణయం
భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా- బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది జరిగే ఆసియా కప్ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి. దీనిపై ఇప్పటికే ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ)కి భారత బోర్డు సమాచారం ఇచ్చినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. తద్వారా ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే పురుషుల ఆసియా కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత జట్టు ఆడే అవకాశాలు లేనట్లు సమాచారం. ఇక, జూన్లో జరిగే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి కూడా వైదొలగాలని బీసీసీఐ నిర్ణయించినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే, దీనిపై బోర్డు నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
పాకిస్తాన్ క్రికెట్ మండలి – భారత అపోహలు
ప్రస్తుతం ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడిగా పాకిస్తాన్ మంత్రి మరియు పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ ఉన్నారు. పాక్ మంత్రి అధినేతగా ఉన్న క్రికెట్ మండలి నిర్వహించే టోర్నీల్లో భారత జట్టు ఆడదు. అది మా దేశ సెంటిమెంట్. అందుకే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి వైదొలుగుతున్నట్లు ఏసీసీకి మౌఖికంగా సమాచారం అందజేశాం. ఫ్యూచర్లో జరగబోయే ఏసియా క్రికెట్ కౌన్సిల్- ఏసీసీ ఈవెంట్లకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించాం. దీనిపై భారత ప్రభుత్వంతో మేం నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం అని ఓ బీసీసీఐ అధికారి తెలిపినట్లు ఆంగ్ల వార్తా సంస్థలు కథనాల్లో పేర్కొన్నాయి.
బ్రాడ్కాస్టింగ్, స్పాన్సర్ షాక్
2024లో ఆసియా కప్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ను సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా దక్కించుకుంది. వచ్చే ఎనిమిది సంవత్సరాల పాటు ప్రసారాలు చేసేలా 170 మిలియన్ డాలర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒకవేళ ఇప్పుడు టోర్నీ జరగకపోతే ఆ డీల్ రద్దయ్యే అవకాశం ఉంది.
ఇండియా లేకుండా ఆసియా కప్?
జమ్ముకశ్మీర్లోని పహల్గాం ఉగ్ర దాడిలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ను ఏకాకిని చేయాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ క్రికెట్ ఈవెంట్లకు ఉన్న స్పాన్సర్లలో ఎక్కువ మంది భారత్కు చెందిన వారే. కాగా, భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ లేకుండా ఆసియా కప్ ఉంటే, దాన్ని ప్రసారం చేసేందుకు బ్రాడ్కాస్టర్లు కూడా అంత ఆసక్తి చూపించే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో టీమ్ఇండియా లేకుండా ఆసియా కప్ టోర్నీని నిర్వహించడం అనేది సరైన నిర్ణయం కాదని ఏసీసీ భావించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాల అభిప్రాయం.
2023 ఆసియా కప్
గత ఏడాది 2023లో కూడా ఇదే సమస్య తలెత్తింది. ఆ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వగా, భారత్ ఆ దేశానికి వెళ్లేందుకు నిరాకరించింది. అందుకే శ్రీలంక వేదికగా భారత్ మ్యాచ్లు నిర్వహించారు. ఇదే పద్ధతిని ఈ ఏడాది కూడా అనుసరించాలన్న అభిప్రాయాలు ఉన్నా, ఈసారి పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంది.
Read also: Moeen Ali: ఆపరేషన్ సిందూర్ సమయంలో పీఓకేలోనే మా తల్లితండ్రులు:మొయిన్ అలీ