అమెరికా అధ్యక్షుడిగి రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ మూడు రోజుల్లోనే తన ప్రతాపం చూపిస్తున్నారు. అమెరికాలో ఏ మూలన ఉన్నా అక్రమ వలసదారులను ఉపేక్షించనని ఎన్నికల్లో ట్రంప్ హామీ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. మెక్సికోతో పాటు ఇతర దేశాల నుంచి అక్రమంగా వచ్చిపడిన వలసదారులను గుర్తించి అరెస్టులు ప్రారంభించారు. ట్రంప్ అధ్యక్ష పీఠ అధిరోహించిన మూడో రోజుల్లోనే ఏకంగా 580 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో టెర్రరిస్ట్ ట్రెన్ డి అరగువా గ్యాంగ్కు చెందిన నలుగురు సభ్యులు కూడా ఉన్నారు. అలాగే మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడిన అనేక మంది నేరస్తులు కూడా ఉన్నట్టు కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు.

ఇది అమెరికా చరిత్రలో అతిపెద్ద ఆపరేషన్ అని ట్రంప్ కార్యవర్గం అభివర్ణించింది. అక్రమ వలసదారులను బంధించి మిలిటరీ విమానంలోకి ఎక్కిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రంప్ సోమవారం అమెరికా-మెక్సికో బోర్డర్ దగ్గర అత్యయిక పరిస్థితిని విధించారు. సరిహద్దు దగ్గర హింస, అక్రమ చోటబాటుదారులను నివారించే విషయంలో ట్రంప్ కఠినంగా వ్యవహరించబోతున్నారు.