ఉద్యోగావకాశాలు పెంపొందించి దేశంలో ఆర్థిక స్థిరతను సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం “పీఎం వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన” (PM Vikas Bharat Rozgar Yojana) పేరిట ఓ కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. రెండు సంవత్సరాల్లో 3.5 కోట్ల ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా పెట్టుకొని ఈ పథకాన్ని రూపొందించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భారీగా ₹99,446 కోట్లను కేటాయించింది.
ఉద్యోగం కల్పించే సంస్థలకు ప్రోత్సాహం
ఈ పథకం కింద ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రైవేట్ కంపెనీలు, సంస్థలకు నేరుగా లబ్ధి చేకూరనుంది. కొత్త ఉద్యోగాలను కల్పించే ప్రతి ఉద్యోగి కోసం సంస్థకు రూ.3,000 చొప్పున మద్దతు నిధిని ప్రభుత్వం అందించనుంది. ఇది సంస్థలపై మానవ వనరుల భారం తగ్గించడంలో తోడ్పడనుంది. కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి ఇది పెద్ద ప్రోత్సాహకంగా మారనుంది.
ఉద్యోగార్థులకు ప్రత్యేక ప్రయోజనాలు
ఈ పథకం ద్వారా తొలిసారి ఉద్యోగం పొందుతున్న EPFO (Employees’ Provident Fund Organization) ఖాతాదారులకు రూ.15,000 వరకు నేరుగా లబ్ధి అందనుంది. అంటే కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి ప్రొవిడెంట్ ఫండ్ కింద ప్రభుత్వ మద్దతు అందించనుంది. ఇది యువతలో ఉద్యోగాలపై ఆసక్తిని పెంచే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పథకం దేశంలో ఉద్యోగాల వృద్ధికి మళ్లీ దోహదం చేయనున్న నూతన ప్రణాళికగా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.
Read Also : AP Metro Rail : మెట్రో ప్రాజెక్టులపై మంత్రి నారాయణ కీలక ప్రకటన