YS Sharmila: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని జిందాల్ అల్యూమినా రిఫైనరీ భూ బాధితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పూర్తిస్థాయిలో అండగా ఉంటామని ప్రకటించారు. మంగళవారం బాధితులు తనను కలిసి 18 ఏళ్లుగా సాగుతున్న వంచనను వివరించగా, ఆమె ఉద్వేగభరితంగా స్పందించారు. స్థానిక జామిలో జరిగిన సభలో పరిశ్రమల స్థాపన పేరుతో భూములు లాక్కుని, 18 ఏళ్లు గడిచినా అటు ఉపాధి కల్పించక, ఇటు భూములు తిరిగి ఇవ్వక పేద రైతులను వంచించడంపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Jagan : బీజేపీతో జగన్ అక్రమ పొత్తు – షర్మిల

18 ఏళ్లుగా సాగుతున్న వంచన: రైతుల ఆవేదన
2007-08 కాలంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చిన ప్రాజెక్ట్ అని, ఆయన మాట తప్పరన్న నమ్మకంతో సుమారు 1,100 ఎకరాల అసైన్డ్, పట్టా భూములను ప్రభుత్వానికి అప్పగించామని కిల్తంపాలెం, ముషిడిపల్లి, మూల బొడ్డవర, పెద్దఖండేపల్లి పంచాయతీలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. “నాడు భూ యజమానులమైన మేము, నేడు పొట్టకూటి కోసం వలస కూలీలుగా మారాం” అని రైతులు వాపోయారు. 18 ఏళ్లు గడిచినా ఒక్క ఉద్యోగం రాలేదని, జిందాల్ సంస్థ ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా భూములను అట్టిపెట్టుకుని భూ దందాలకు పాల్పడుతోందని వారు వినతిపత్రంలో
పేర్కొన్నారు. గత జూన్ 2025 నుండి స్థానిక రెవెన్యూ, కంపెనీ ప్రతినిధులు పోలీసు బలగాలతో తమను భయభ్రాంతులకు గురిచేస్తూ అక్రమంగా ఖాళీ చేయిస్తున్నారని రైతులు షర్మిల దృష్టికి తీసుకెళ్లారు.
రాజన్న బిడ్డగా నేను మీ తరపున కొట్లాడుతాను: షర్మిల
రైతులతో మాట్లాడిన సందర్భంగా షర్మిల దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని స్మరించుకున్నారు. “రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉండి ఉంటే ఇప్పటికే ఇక్కడ పరిశ్రమ స్థాపించబడి ఉండేది. ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెంది, రైతులకు, వారి కుటుంబాలకు ఎంతో మేలు జరిగేది” అని ఆమె పేర్కొన్నారు. నేడు ఆశించిన అభివృద్ధి జరగకపోవడం, రైతులు రోడ్డున పడటం అత్యంత బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి తాను తక్షణమే రంగంలోకి దిగుతానని షర్మిల హామీ ఇచ్చారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్తో స్వయంగా మాట్లాడి రైతుల సమస్యను వివరిస్తానని, అలాగే ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాసి 1,100 ఎకరాల భూములను తిరిగి రైతులకు అప్పగించాలని డిమాండ్ చేస్తానని స్పష్టం చేశారు. “రాజన్న మాట నమ్మి ఆనాడు మీరు భూములు ఇచ్చారు, నేడు అదే రాజన్న బిడ్డగా నేను మీ తరపున కొట్లాడుతాను” అని షర్మిల భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందని, పోలీసులు, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎదిరిస్తామని ఆమె స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: