అన్నమయ్య జిల్లా గేరంపల్లికి చెందిన పుష్ప అనే తెలుగు మహిళ కువైట్లో (Woman in Kuwait) భయానక పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి ఆశతో సముద్రాలు దాటి వెళ్లిన ఆమెకు అక్కడ అసహన భరించలేని వేదన మొదలైంది. ఏజెంట్ చెప్పిన వాగ్దానాలు ఒక్కటీ నిజం కాకపోవడంతో ఆమె జీవితమే తలకిందులైంది.పుష్ప భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు పిల్లల బాధ్యత తనపై పడింది. వారి చదువులకు అవసరమైన డబ్బు కోసం కువైట్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పీలేరుకు చెందిన సురేష్ అలియాస్ స్వరాజ్ అనే ఏజెంట్ ద్వారా మే 27న కువైట్ చేరారు.
ఒక పని అన్నారు, మరో పని చేస్తుంటారు
వాస్తవికత మాత్రం వేరే గాధ. పని పేరుతో గృహ కార్యకలాపాల్లో బానిసలా పనిచేయాల్సి వచ్చింది. యజమానులు తిండీ సరిగా పెట్టడం లేదని, శారీరకంగా వేధిస్తున్నారని పుష్ప వాపోయారు. కొడుతున్నారు, చిత్రహింసలు పెడుతున్నారు. తినడానికి కూడా ఇవ్వడం లేదు, అంటూ ఆమె కన్నీటి కథను వీడియోలో వెల్లడించారు.
బాత్రూంలో దాక్కొని వీడియో పంపిన పుష్ప
తన పరిస్థితిని తెలపడానికి కూడా అవకాశం లేకపోవడంతో పుష్ప బాత్రూంలో దాక్కొని వీడియో రికార్డ్ చేశారు. బయట తలుపులు కొడుతున్నారు. నేను బతకలేకపోతున్నాను. పిల్లల కోసం బతకాల్సిందే, అంటూ ఆవేదనతో వివరించారు.
విముక్తి కోసం మంత్రి లోకేశ్ను వేడుకున్న పుష్ప
యజమానులు తమ ఇల్లు విడిచిపెట్టాలంటే రెండు వేల కువైటీ దినార్లు చెల్లించాలంటున్నారని ఆమె తెలిపారు. తన వద్ద ఆ డబ్బు లేదని, నెల జీతం కేవలం 110 దినార్లే అని చెప్పింది. ఇప్పటి వరకు ఒక్క నెల జీతం మాత్రమే అడిగి తీసుకున్నానని వాపోయారు.ఏజెంట్ సురేష్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఆయన కూడా తిడుతున్నారని ఆమె ఆరోపించారు. చివరికి, మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) మద్దతు కోరుతూ వీడియో ద్వారా వేడుకున్నారు. ఆత్మహత్య ఆలోచనలొస్తున్నాయి. కానీ పిల్లల కోసం బతికే ప్రయత్నం చేస్తున్నాను అని ఆమె కన్నీటి పాఠం చెప్పారు.
Read Also : Sachin Tendulkar : భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదా