అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మరో విజయం సాధించింది. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏడో రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సరికి విజయానికి కావాల్సిన ఓట్లు (51శాతం) రాజశేఖరం సాధించారు. దీంతో మరో రౌండ్ లెక్కింపు ఉండగానే ఆయన గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా కలెక్టరు ఆయనకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేయన్నారు.

కూటమి అభ్యర్థిగా విజయం సాధించినందుకు సంతోషం
ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి.. మొత్తంగా 1,12,331 ఓట్లను పేరాబత్తుల రాజశేఖరం సాధించారు. తన ప్రత్యర్థి దిడ్ల వీర రాఘవులుకు 41,268 ఓట్లు పోలయ్యాయి. దీంతో కూటమి అభ్యర్థి 71,063 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఏడు రౌండ్లు పూర్తయ్యే సరికి 1,96,000 ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. వాటిలో చెల్లిన ఓట్లు 1,78,422 ఉండగా.. చెల్లనివి 17,578 ఓట్లున్నాయి. దాదాపు 22,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది. కూటమి అభ్యర్థిగా ఇంత గొప్ప విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని పేరాబత్తుల రాజశేఖరం అన్నారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే డీఎస్సీ
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, రెండు జిల్లాల పట్టభద్రుల ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పట్టభద్రుల హక్కుల సాధనకు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. నిరుద్యోగ యువత పట్ల గత ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరించింది. ఈ 8 నెలల కాలంలోనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీపైనే చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువత లేకుండా, అందరికీ ఉద్యోగాలు వచ్చేలా నా వంతు ప్రయత్నం చేస్తా అని తెలిపారు.