గోదావరి జలాలను సముద్రంలో వృథాగా కలిసిపోనివ్వకుండా వినియోగించాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.సోమిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం 2500 నుంచి 3000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. వీటిలో కేవలం 200 టీఎంసీలను బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా వాడుకోవాలన్న ప్రతిపాదనపై తెలంగాణ నేతలు వ్యతిరేకించడం బాధాకరం, అన్నారు.ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఏం తప్పు మాట్లాడారని హరీశ్ రావు అక్కసు వెళ్లగక్కుతున్నారు?” అని సోమిరెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు.
గోదావరి జలాల వాటా స్పష్టమే
గోదావరి నికర జలాల్లో ఏపీకి 572 టీఎంసీలు, తెలంగాణకు 968 టీఎంసీలు కేటాయించబడ్డాయని ఆయన గుర్తు చేశారు. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలు కలిపి 800 టీఎంసీలను కూడా వినియోగించలేకపోతున్నాయి, అని చెప్పారు.బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా 7.42 లక్షల ఎకరాలకు సాగునీరు, 2.58 లక్షల ఎకరాలకు స్థిరీకరణ కల్పించాలన్నది ఏపీ లక్ష్యం. అదనంగా, 80 లక్షల మందికి తాగునీరు, పరిశ్రమలకు 20 టీఎంసీల నీరు అందించనుంది.గోదావరి జలాలతో రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని కేసీఆర్ మాటిచ్చారు. కానీ హరీశ్ రావు ఒక్క చుక్క నీరు ఇవ్వమంటూ మాట్లాడటం విచారకరం, అని సోమిరెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం చెప్పలేదని వ్యాఖ్య
“కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద తెలంగాణ 450 టీఎంసీల నీటిని వాడుకుంటోంది. అయినా ఏపీ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఇతర ప్రాజెక్టులపైనా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు, అని ఆయన తెలిపారు.తెలుగు ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. ఏపీ ప్రజలను పాకిస్తాన్ ఉగ్రవాదుల్లా చూడవద్దు. రాష్ట్రం విడిపోయినా బేధాలు ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ నేతలకు విజ్ఞప్తి
“బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నేతలు సహకరించాలి. మిగులు జలాలతో కరవు రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్నదే మా లక్ష్యం. కేసీఆర్తో కలిసి మేము ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశాం. స్నేహితులమయ్యాం. దయచేసి మమ్మల్ని ద్వేషించకండి, అని సోమిరెడ్డి కోరారు.కేసీఆర్ రతనాల సీమ చేస్తానని మాటిచ్చారు. కానీ హరీశ్ రావు ఒక్క చుక్క కూడా ఇవ్వమంటున్నారు. తెలంగాణలోని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు మంచి మనస్సు చేసుకుని మమ్మల్ని అర్థం చేసుకోవాలి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ముగ్గురూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవాలి, అని ఆయన పేర్కొన్నారు.
Read Also : Anam Ramanarayana Reddy : జగన్ పై ఓ రేంజిలో విరుచుకుపడ్డ ఆనం