గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)కి రెండు రోజుల పోలీస్ కస్టడీ శుక్రవారం ముగిసింది. బాపులపాడు మండలంలో వెలుగులోకి వచ్చిన నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయనను పోలీసులు విచారించారు. అనుమానాస్పద పాత్రపై దర్యాప్తు చేస్తూ, వంశీని కోర్టు అనుమతితో రెండు రోజులపాటు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, ఆయనను నూజివీడు కోర్టులో హాజరుపరిచి, విజయవాడ సబ్ జైలుకు తరలించారు.
నకిలీ పట్టాలపై ప్రశ్నల వర్షం
విచారణ సమయంలో పోలీసులు వంశీకి నకిలీ పట్టాల తయారీ, పంపిణీ, సంబంధిత వ్యక్తుల ప్రమేయం వంటి అంశాలపై సుమారు 30 పైగా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఈ నకిలీ పత్రాలు ఎక్కడ తయారయ్యాయి? ఎవరు చేసారు? వీటి వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? వంటి కీలక అంశాలపై స్పష్టత పొందేందుకు అధికారులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే, తనకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని వంశీ పోలీసుల ఎదుట స్పష్టం చేసినట్లు సమాచారం. ఆరోగ్య సమస్యల కారణంగా విచారణకు కొంత ఆటంకం ఏర్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఆరోగ్యంపై భార్య ఆందోళన
కస్టడీ అనంతరం వంశీ భార్య పంకజశ్రీ (Pankajasri) మీడియాతో మాట్లాడుతూ భర్త ఆరోగ్యంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. వంశీ ఇప్పటికే 20 కేజీల బరువు తగ్గారని, ప్రస్తుతం ఆయనకు సీప్యాప్ పరికరం సహాయం లేకుండా శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతోందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న వైద్యం సరిపోవడం లేదని, మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించాలని కోర్టును కోరినట్లు పేర్కొన్నారు. వంశీ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంటనే స్పందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Read Also : Tragic Incident : కర్ణాటకలోని మైసూరులో విషాదకర ఘటన