ఆర్జీయూకేటీ ఎంపిక జాబితా విడుదల చేసిన మంత్రి లోకేష్
Vijayawada: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని ట్రిపుల్ ఐటీల్లో (Triple IT) 94.78% సీట్లను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు సాధించినట్లు ప్రవేశాల కమిటీ చైర్మన్, కులపతి మధుమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. ట్రిపుల్ ఐటీల్లో (Triple IT) ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను మంత్రి లోకేష్ (Lokesh) ఎక్స్ వేదికగా సోమవారం విడుదల చేశారు. రాష్ట్రంలో ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళంలలో నాలుగు క్యాంపస్లు ఉన్నాయి. వీటిల్లో ఆరేళ్ళ సమీకృత ఇంజనీరింగ్ కోర్సు నిర్వహిస్తున్నారు. మొదటి రెండేళ్ళు ప్రీ యూనివర్సిటీ కోర్సుగా (యూపీసీ) పరిగణిస్తారు. మిగతా నాలుగేళ్ళు బిటెక్ చదువుతారు. ఒక్కో క్యాంపస్లో ఈ డబ్ల్యూఎస్ కోటాతో కలిపి 1,100 సీట్లు చొప్పున ఉన్నాయి. ఆర్జీయూ కేటీలో ప్రవేశాలకు మొత్తం 50,541 ధరఖాస్తులు రాగా.. వాటిల్లో నుంచి నాలుగు క్యాంపస్లకు కలిపి 4,040 మందితో ఎంపిక జాబితా ప్రకటించారు. క్రీడలు, ఎన్సీసీ, మాజీ సైనికోద్యోగుల కోటాలకు సంబంధించి మరో 360 కోట్లకు సంబంధించిన జాబితాను విడుదల చేయాల్సి ఉంది.
జూన్ 30 నుంచి జులై 5 వరకు ధృవపత్రాల పరిశీలన
మొత్తం సీట్లలో ప్రభుత్వ బడుల్లో పదో తరగతి చదివిన విద్యార్థులు 94.78%, ప్రైవేటు పాఠశాలల్లో చదివిన వారు 5.22% సీట్లు సాధించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 4% అదనపు స్కోర్ కలిపారు. సీట్లు పొందిన వారిలో అత్యధికంగా 69.01% మంది బాలికలు ఉండగా.. బాలురు 30.99% మంది ఉన్నారు. విద్యార్థులు కాల్ లెటర్లను వెబ్సైట్ నుంచి, డౌన్లోడ్ చేసుకోవాలని, మనమిత్ర వాట్సప్ యాప్లో నూ సూచించారు. నూజివీడు (Nuzvidu) క్యాంపస్లకు సంబంధించి నూజివీడులో ధృవపత్రాల పరిశీలన జూన్ 30, జులై 1న నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్లకు సంబంధించి నూజివీడులో జులై 2 నుంచి 5 వరకు ఈ ప్రక్రియ చేపడతారు.న ఇడుపులపాయకు (ఆర్కేవ్యాలీ) సంబంధించి ఆర్కే వ్యాలీలో జూన్ 30 నుంచి జులై 1 వరకు ధృవపత్రాల పరిశీలన ఉంటుంది. ట్రిపుల్ ఐటీల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి అత్యథికంగా 8.69% మంది విద్యార్థులు సీట్లు సాధించగా.. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి 0.17% మంది సీట్లు పొందారు. ఎంపిక జాబితాలో మొదటి 20 స్థానాల్లో నిలిచిన అభ్యర్ధుల్లో 17 మంది నూజివీడు (Nuzvidu) క్యాంపస్, ఎంచుకున్నారు. ముగ్గురు ఆర్కేవ్యాలీ తీసుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లా కొడిగేహళ్ళి లోని ఏపీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థి కె. లక్ష్మీనరసింహరెడ్డి మొదటి ర్యాంకు సాధించగా.. పల్నాడు జిల్లా ఒప్పిచెర్ల ప్రభుత్వ జిల్లా పరిషత్తు పాఠశాలకు చెందిన అంగడి పావని చంద్రిక, శ్రీకాకుళం జిల్లా హరిపురం జడ్పీహెచ్ఎస్కు చెందిన జ్యోషిత రెండు, మూడు ర్యాంకులు సాధించారు. మొత్తం సీట్లలో 5% సూపర్ న్యూమరరీ సీట్లు ఉన్నాయి. వీటిని ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించారు. వీరు ఏడాదికి ట్యూషన్ ఫీజు రూ.1.50 లక్షలు చెల్లించాలి. సూపర్ న్యూమరరీ కింద 200 సీట్లు కేటాయించారు.
Read also: TTD: అలిపిరి తనిఖీ కేంద్రంలో లైన్లు పెంపు