విజయవాడ Tribute : గ్రాంధిక భాషను సరళ భాషగా, జనంవాడుక భాషగా తీర్చిదిద్దిన వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి (Venkata Ramamurthy) తెలుగువారందరికీ చిరస్మరణీ యుడేనని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అన్నారు. స్థానిక బందరు రోడ్డులో గల ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో గిడుగు జయంతి కార్యక్రమాన్ని గ్రంథాలయాధికారిణి కె. రమాదేవి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యాసాగర్ (Vidyasagar) గిడుగు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాలయాల్లో వున్న శాసనాల లిపిని స్వతంత్రంగా నేర్చుకుని ఎన్నో చారిత్రక అంశాల్ని వెలికి తీసిన భాషాపండితుడు గిడుగు అన్నారు. మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ అధ్యక్షుడు కలిమిశ్రీ మాట్లాడుతూ తెలుగు మాసపత్రికను స్థాపించి శాస్త్రీయ వ్యాసాలతో నడిపి, వీరేశలింగం, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి వంటి ఉద్దండ కవుల్ని వ్యావహారిక భాషా ఉద్యమం వైపు నడిపించిన పత్రికా భాషోద్యమ నాయకుడు, సంఘసంస్కర్త గిడుగు వెంకట రామమూర్తి అని అన్నారు. ఈ సందర్భంగా కనుమరుగవుతున్న అనుబంధాలను ఉమ్మడి కుటుంబాల్లో పునరుజ్జీవింపజేసే 19 కథలతో జ్యోతి మువ్వల రచించిన అరవింద కథల సంపుటిని అలపర్తి విద్యాసాగర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ చొప్పా రాఘవేంద్రశేఖర్, ఏపీఎన్జీవో పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు డి. సత్యనారాయణ రెడ్డి గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :