TTD latest updates : తిరుపతి జిల్లా, తిరుమల, ప్రభాతవార్త ప్రతినిధి తిరుమలలో పాద రక్షల ట్రాకింగ్ వ్యవస్థకు విశేష స్పందన ఆరు నెలల్లో 8.45 లక్షలకు పైగా పాద రక్షల సమర్థ నిర్వహణ ఈ నూతన విధానంపై భక్తుల్లో హర్షాతిరేకాలు త్వరలో మరిన్ని ప్రాంతాలకు సేవలు విస్తరణ తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ అమలు చేస్తున్న క్యూ ఆర్ కోడ్ ఆధారిత పాద రక్షల ట్రాకింగ్ & మేనేజ్మెంట్ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తూ విశేష ఫలితాలను అందిస్తోంది. ఆధునిక సాంకేతికతతో అమలులోకి వచ్చిన ఈ విధానం ద్వారా భక్తులు తమ పాద రక్షలను సులభంగా డిపాజిట్ చేసి, తిరిగి వేగంగా పొందగలుగుతున్నారు.
2025 సెప్టెంబర్ నుండి 2026 ఫిబ్రవరి 15 వరకు మొత్తం 8,45,816 పాద రక్షల డిపాజిట్–డెలివరీ లావాదేవీలు ఈ విధానం ద్వారా విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ కాలంలో భక్తుల నుంచి స్వీకరించిన 4,24,047 పాద రక్షల్లో, 4,21,769 పాద రక్షలను సురక్షితంగా తిరిగి అందజేయడం జరిగింది. దాదాపు అన్ని కేంద్రాల్లో పాద రక్షల తిరిగి పొందే శాతం అత్యంత అధికంగా నమోదు కావడం ఈ వ్యవస్థ సమర్థతను ప్రతిబింబిస్తోంది. వీటిలో ఏటీజీహెచ్ కేంద్రంలో మొత్తం 44,714 పాద రక్షలు సేకరించగా, వాటిలో 44,340 పాద రక్షలు భక్తులకు పంపిణీ చేయబడ్డాయి.
కృష్ణ తేజ సర్కిల్ కేంద్రంలో 56,019 పాద రక్షలు సేకరించగా, 55,428 పాద రక్షలు పంపిణీ అయ్యాయి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో 55,238 పాద రక్షలు సేకరించబడగా, 54,928 పాద రక్షలు భక్తులకు అందించబడ్డాయి. పీఏసీ-5 కేంద్రంలో అత్యధికంగా 1,38,270 పాద రక్షలు సేకరించగా, వాటిలో 1,37,904 పాద రక్షలు పంపిణీ చేయబడ్డాయి. అదే విధంగా రామ్ భగీచ విశ్రాంతి గృహం కేంద్రంలో 76,556 పాద రక్షలు సేకరించగా, 76,071 పాద రక్షలు పంపిణీ అయ్యాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కేంద్రంలో 53,250 పాద రక్షలు సేకరించబడగా, 53,098 పాద రక్షలు పంపిణీ చేయబడ్డాయి.
ప్రత్యేకించి రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ విధానం భక్తులకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోంది. ఫిబ్రవరి 1 నుండి 15వ తేదీ వరకు కేవలం 15 రోజుల్లోనే 1,35,314 పాద రక్షల లావాదేవీలు జరగడం ద్వారా రద్దీ సమయాల్లోనూ ఈ వ్యవస్థ ఎంత వేగంగా, క్రమబద్ధంగా పనిచేస్తోందో స్పష్టమవుతోంది. గతంలో తిరుమలలోని రద్దీ ప్రాంతాల్లో పాద రక్షలు అస్తవ్యస్థంగా పడి ఉండటం, భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆ సమస్యలకు పరిష్కారంగా ప్రత్యేక చోరవ తీసుకుని ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సహకారంతో డిప్యూటీ ఈవో సోమన్నారాయణ ఆధ్వర్యంలో పాద రక్షల నిర్వహణలో పారదర్శకత, క్రమబద్ధత పెరగడంతో భక్తులకు కలిగే ఇబ్బందులు గణనీయంగా తగ్గాయి.
Read Also: Maharashtra: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. సీబీఐ విచారణకు సునేత్ర డిమాండ్

ఈ నూతన విధానంపై భక్తుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పాద రక్షలు తప్పిపోవడం, గందరగోళం ఏర్పడడం వంటి సమస్యలు తరచుగా ఎదురయ్యేవనీ, నూతన ట్రాకింగ్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలు దాదాపుగా పూర్తిగా తొలగిపోయాయని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయడం, సిబ్బంది సంఖ్యను పెంచడం వంటి చర్యలతో ఈ వ్యవస్థను మరింత విస్తరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో కల్యాణకట్ట, బేడి ఆంజనేయస్వామి ఆలయం, ఏటీసీ సర్కిల్ వద్ద మరో మూడు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
తిరుమల నాలుగు మాడ వీధుల్లో పాదరక్షల వాడకం నిశిద్దo తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ ఉండే నాలుగు మాడ వీధుల్లో దాదాపు ప్రతి రోజూ స్వామి వారు విహరిస్తారు కనుక పాద రక్షలు ధరించడం నిషిద్ధం. కావున భక్తులు తప్పనిసరిగా పాద రక్షల కొరకు టీటీడీ ఏర్పాటు చేసిన ఈ నూతన విధానాన్ని వినియోగించుకోగలరు. ఈ ఆధునిక ట్రాకింగ్ వ్యవస్థ వల్ల తిరుమలలో పరిశుభ్రత మరింత మెరుగుపడటమే కాకుండా, భక్తులకు సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన దర్శన అనుభవం అందించడమే ప్రధాన లక్ష్యంగా టీటీడీ ఈ స్మార్ట్ షూ కీపింగ్ విధానాన్ని అమలు చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: