Tiger: కుట్ర పూరితంగానే పులిని వదిలారు.. దాన్ని చంపేస్తాం గిరిజనుల హెచ్చరిక పాపికొండల అభయారణ్యంలో వదిలిపెట్టిన ‘ఎక్స్ప్లోరర్’ అనే పెద్దపులి ఇప్పుడు రంపచోడవరం ఏజెన్సీ గ్రామాలను వణికిస్తోంది. అధికారులే కావాలని పులిని తమ గ్రామాలపైకి వదిలారని ఆగ్రహిస్తున్నారు. విల్లులు-బాణాలతో పులిపై ఎదురుదాడికి దిగుతామని ఆదివాసీలు హెచ్చరిస్తుండటంతో మన్యంలో హైటెన్షన్ నెలకొంది.
ఈ నెల 6న రాజమండ్రి పరిసరాల్లో పట్టుబడ్డ ఈ పెద్దపులికి ‘ఎక్స్ప్లోరర్’ అని నామకరణం చేసి, వారం క్రితం పాపికొండల అభయారణ్యంలో అటవీ శాఖ (Forest Department) అధికారులు విడిచిపెట్టారు. అయితే, గత ఐదు రోజులుగా ఇది బోలగొండ ఫారెస్ట్ పరిధిలోని రంప, మర్రవాడ, పెద్ద గొండ గ్రామాలకు సమీపంలోనే సంచరిస్తోంది. గత రాత్రి ఒక ఆవుదూడపై దాడి చేయడంతో గిరిజనుల సహనం నశించింది.
Read Also: Nandyala Road Accident: క్రేన్ను ఢీకొట్టిన కారు: ముగ్గురు దుర్మరణం
విల్లులు-బాణాలతో పులిపై దాడి చేస్తాం
అధికారులు, ప్రజాప్రతినిధులు కుట్ర పూరితంగానే పులిని తమపైకి వదిలారని ఆదివాసి భారత్ పార్టీ ఇంచార్జ్ అంజిరెడ్డి మండిపడ్డారు. “మా ప్రాణాలు కాపాడుకోవడానికి మా దగ్గర ఉన్న విల్లులు-బాణాలతో పులిపై దాడి చేస్తాం” అంటూ ఆయన విడుదల చేసిన వీడియో సందేశం ఇప్పుడు కలకలం రేపుతోంది. దీంతో అటవీ ప్రాంతంలో గిరిజనులకు, పులికి మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం అడవిలో జీడిపిక్కలు సేకరించే కీలక సమయం కావడంతో పులి భయం కారణంగా గిరిజనులు అటవీ ప్రాంతంలోకి వెళ్లలేకపోతున్నారు. దీనివల్ల తమ ఫలసాయాన్ని కోల్పోతున్నామని, నిలదీస్తున్నారు. ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ఫారెస్ట్ రేంజ్ అధికారులు రంగంలోకి దిగారు. పులి తన దారిన తాను వెళ్ళిపోతుందని, మరో రెండు రోజుల పాటు గిరిజనులు అడవిలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. పులి దాడిలో గాయపడిన ఆవుదూడకు పశు సంవర్ధక శాఖ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: