20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా రూఫ్టాప్ సోలార్
అమరావతి: 2025-26లో విద్యుత్ ఛార్జీల పెరుగుదల ఉండదని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రకటించారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ.. 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా రూఫ్టాప్ సోలార్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందించేలా వ్యవసాయ ఫీడర్ల సోలరైజేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రకటించారు.
రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళుతున్నాం
గత ప్రభుత్వం తీరుకు ఓటుతో ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. అన్ని అంశాలల్లోనూ గత ప్రభుత్వం విఫలమైందని వివరించారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎంతో దెబ్బతీశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. అభివృద్ధి, సంక్షేమం నాణేనికి రెండు వైపుల లాంటిదని తెలిపారు. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళుతున్నామని ప్రకటించారు. ఐటీ నుంచి ఏఐ రెవల్యూషన్ దిశగా ఏపీ సాగుతోందని వివరించారు. పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
సభ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ
మరోవైపు ఏపీ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. వైసీపీ సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. కాసేపు నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన వైసీపీ సభ్యులు ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు. వైసీపీ వాకౌట్ తర్వాత గవర్నర్ ప్రసంగం కొనసాగింది. ప్రసంగం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ గవర్నర్ ను వాహనం వరకు తీసుకెళ్లి వీడ్కోలు పలికారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.