త్వరలో భారత్ లోకి టెస్లా ఎంట్రీ – మంత్రి వాసంశెట్టి సుభాష్

Read Time:  1 min
vasam
vasam
FONT SIZE
GET APP

ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వాహన పరిశ్రమలో ఓ విప్లవాత్మక మార్పును తీసుకొచ్చిన టెస్లా త్వరలోనే భారత్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించబోతుందని సమాచారం. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఈ దిగ్గజ సంస్థ ఇప్పటికే భారత్‌లో ఉద్యోగులను నియమించుకోవడం ప్రారంభించడంతో, టెస్లా ఎంట్రీపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. టెస్లా కోసం కేంద్ర ప్రభుత్వం అనేక విధానపరమైన సడలింపులను అందించేందుకు ప్రయత్నిస్తుండటంతో, కంపెనీ ఇక్కడ తన ఉనికిని పెంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Tesla
Tesla

భారత్‌లో తయారీ ప్లాంట్‌

ఇప్పటికీ టెస్లా తన తయారీ ప్లాంట్‌ను భారత్‌లో ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. దేశంలోని అనేక ప్రధాన రాష్ట్రాలు తమ ప్రాంతంలో టెస్లా పరిశ్రమను స్థాపించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కూడా టెస్లాను రాష్ట్రానికి ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. టెస్లాకు కావాల్సిన అన్ని అనుకూలమైన పరిస్థితులు ఏపీలో ఉన్నాయని, గతంలో కియా మోటార్స్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చిన అనుభవం ఇప్పుడు టెస్లాపైనా ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

కియా మనది… టెస్లా కూడా మనదే

ఈ పరిణామాల మధ్య, ఏపీ పరిశ్రమల మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన ట్వీట్ మరింత ఆసక్తిని రేకెత్తించింది. “చంద్రబాబు కియా తీసుకువచ్చారు… లోకేశ్ టెస్లా తెస్తారు. విజన్ ఉన్న నాయకులు పాలనలో ఉంటే రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరుగుతుంది. కియా మనది… టెస్లా కూడా మనదే” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి ట్వీట్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రకటనతో, టెస్లా ఏపీలోకి వస్తుందా? లేదా ఇతర రాష్ట్రాలకు పోతుందా? అన్నది ఆసక్తిగా మారింది.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.