ఆంధ్రప్రదేశ్లో ఆలూరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ (Chippagiri Lakshminarayana) హత్య కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఈ కేసులో గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ(Gummanuru Narayana Arrest)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణను వైద్య పరీక్షల అనంతరం ఆలూరు కోర్టులో హాజరుపరిచిన అధికారులు, ఆయనను 14 రోజుల న్యాయ హిరాసతులోకి పంపించడంతో కర్నూలు జిల్లా జైలుకు తరలించారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన హత్య కేసు
ఈ హత్యకేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలు, ఫోన్ కాల్ రికార్డులు, సీసీ కెమెరా దృశ్యాలు తదితరాలను విశ్లేషించిన పోలీసులు, నారాయణ పాత్రపై స్పష్టతకు వచ్చారు. అందులో భాగంగా ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరికొందరిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకోనున్నట్లు ఏఎస్పీ హుసేన్ పీరా వెల్లడించారు.
నారాయణ అరెస్ట్ తో టీడీపీ వర్గాల్లో కలవరం
తాజా అరెస్ట్తో ఆలూరు ప్రాంతంలో రాజకీయంగా చర్చలకు ఊతం లభించింది. టీడీపీ వర్గాల్లో కలవరం నెలకొనగా, కాంగ్రెస్ నేతలు న్యాయం జరగాలన్న డిమాండ్తో ముందుకు వస్తున్నారు. కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు నిష్పాక్షికంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. హత్య వెనుక అసలు కారణాలు, ప్రమేయాలపై త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.