ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా బియ్యం, గోధుమపిండి, పంచదార, కందిపప్పు వంటి సరుకులను అందిస్తున్న ప్రభుత్వం, తాజాగా తృణ ధాన్యాలను కూడా రేషన్ కార్డుదారులకు అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా డిసెంబర్ నెల కోటా కింద రేషన్ కార్డుదారులకు బియ్యం బదులుగా రాగులను పంపిణీ చేయనుంది. ప్రజలకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి వెల్లడించారు. ఈ నిర్ణయంతో బీద, మధ్య తరగతి ప్రజల ఆహారంలో పోషక విలువలు పెరిగే అవకాశం ఉంది.
Latest news: Panchayat elections: తెలంగాణ లో పంచాయతీ ఎన్నికలు సందడి
అధికారుల ప్రకటన ప్రకారం, అనకాపల్లి జిల్లాలోని రేషన్ కార్డుదారులకు రేపటి నుంచి (నవంబర్ 27) రాగుల పంపిణీ ప్రారంభం కానుంది. డిసెంబర్ నెల కోటాకు సంబంధించిన రేషన్ సరుకుల పంపిణీ గురువారం నుంచి మొదలుకానుంది. రేషన్ కార్డు ఉన్నవారికి, వారు బియ్యం వద్దనుకుంటే, ఆ మేరకు బియ్యం బదులుగా మూడు కిలోల వరకు రాగులను ఉచితంగా అందించనున్నారు. దీనికోసం ఇప్పటికే అన్ని రేషన్ దుకాణాల వద్ద రాగుల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ జరుగుతుంది. ఆదివారాలు, సెలవు దినాలతో సంబంధం లేకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో డీలర్లు రేషన్ అందిస్తున్నారు. అలాగే, దివ్యాంగులు, వృద్ధులకు ముందస్తుగానే డోర్ డెలివరీ చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు కొత్త రేషన్ కార్డుదారులకు కూడా తీపికబురు అందించింది. బియ్యం కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందించినప్పటికీ, ఇంతవరకు వారికి రేషన్ సరుకుల పంపిణీ ప్రారంభం కాలేదు. రేషన్ పంపిణీలో అక్రమాలను అరికట్టడానికి ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ కార్డులను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో, కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు కూడా డిసెంబర్ కోటా నుంచి రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఈ నిర్ణయం కొత్తగా అర్హత పొందిన వేలాది మంది పేద కుటుంబాలకు ఉపశమనం కలిగించనుంది. తద్వారా పాత, కొత్త లబ్ధిదారులందరికీ డిసెంబర్ నుంచి సరుకులు, రాగులు అందుబాటులోకి వస్తాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/